మంత్రి పినిపే ఇళ్లకు అగ్గి

ABN , First Publish Date - 2022-05-25T08:23:44+05:30 IST

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూ్‌పకు చెందిన రెండు ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు.

మంత్రి పినిపే ఇళ్లకు అగ్గి

బూడిదయిన విలువైన ఫర్నిచర్‌, పత్రాలు

పేలిన గ్యాస్‌ బండలు... బీటలువారిన గోడలు


అమలాపురం, మే 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూ్‌పకు చెందిన రెండు ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. జిల్లా పేరు మార్చొద్దంటూ మంగళవారం చేపట్టిన ఆందోళన అదుపుతప్పింది. రెచ్చిపోయిన ఆందోళనకారులు ఎర్రవంతెన సమీపంలోని బ్యాంకు కాలనీలో నివాసముంటున్న మంత్రి ఇంటిని చుట్టుముట్టారు. ఆ సమయంలో మంత్రి సతీమణి బేబీ మీనాక్షి, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. పోలీసులు హుటాహుటిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే ఆందోళనకారులు గేట్లు వేసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డారు. రాళ్లతో దాడిచేసి, ఇంటికి నిప్పంటించారు. విలువైన ఫర్నిచర్‌, వ్యక్తిగత ఆస్తి పత్రాలు కాలి బూడిదయ్యాయి. నివాసంలోని గ్యాస్‌ సిలిండర్లు భారీ శబ్ధంతో పేలిపోయాయి. దీంతో పలు గోడలు బీటలు వారాయి. ఆందోళనకారుల రాళ్ల దాడులకు పోలీసులు సైతం పలాయనం చిత్తగించారు. దీంతో ఆందోళనకారుల విధ్వంసం అదుపు లేకుండా సాగింది. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు మంత్రి ఇంటిని పరిశీలించారు. కాగా, అమలాపురం పట్టణంలోని కిమ్స్‌కు సమీపంలో మంత్రి విశ్వరూప్‌ సొంత ఇల్లు నిర్మాణాన్ని చేపట్టారు. ఆ ఇల్లు నిర్మాణ దశలోనే ఉంది. ఇటీవలే ఇంటికి కావలసిన కలపను కొనుగోలు చేసి అక్కడ పెట్టారు. ఆందోళనకారులు ఆ ఇంటికి కూడా రాత్రివేళలో నిప్పు పెట్టడంతో రూ.లక్షల విలువైన కలపతో సహా అక్కడి ఆస్తులు కూడా కాలి బూడిదైంది. ఈ ఘటనలతో చలించిపోయిన మంత్రి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

Updated Date - 2022-05-25T08:23:44+05:30 IST