భూమిని రిజిస్ర్టేషన్ చేయాలని నిరసన
ABN , First Publish Date - 2021-01-16T04:15:51+05:30 IST
మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని పోతనపల్లి గ్రామానికి చెందిన మెండె రాజయ్య వద్ద పానుగంటి లచ్చన్న భూమి కొనుగోలు చేశాడు. అట్టి భూమికి రిజిస్ర్టేషన్ చేయాలని శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి లచ్చన్న క్రిమిసంహారక మందు డబ్బాతో బైఠాయిచాడు.
భీమారం, జనవరి 15 : మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని పోతనపల్లి గ్రామానికి చెందిన మెండె రాజయ్య వద్ద పానుగంటి లచ్చన్న భూమి కొనుగోలు చేశాడు. అట్టి భూమికి రిజిస్ర్టేషన్ చేయాలని శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి లచ్చన్న క్రిమిసంహారక మందు డబ్బాతో బైఠాయిచాడు. పానుగంటి లచ్చన్న మాట్లాడుతూ మెండె రాజయ్య 2016 మే 21న భీమారం శివారులోని సర్వే నెంబరు 651లో 225 చదరపు గజాల భూమిని పెద్ద మనుషుల సమక్షంలో రూ. 14,87,500లకు కొనుగోలు చేశానని, ఇందుకు గాను అదే రోజు రూ. 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చానని, జూన్ నెలలో మొదటి విడతగా రూ. 6,37,500, రెండో విడతగా రూ. 3 లక్షలు ఇచ్చానని తెలిపారు. మొత్తం రూ. 11,37,500 రాజయ్యకు ఇచ్చానని, మిగితా రూ. 3.50 లక్షలను రిజిస్ర్టేషన్ అయిన వెంటనే చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. కానీ 5 సంవత్సరాల నుంచి భూమి రిజిస్ర్టేషన్ చేయాలని రాజయ్యకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. గతంలో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని బాధితుడు లచ్చన్న ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో మెండె రాజయ్య తమ్ముడు మల్లేష్ వచ్చి నిరసన చేస్తున్న పానుగంటి లచ్చన్న, కుటుంబీకులకు నచ్చజెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువురికి నచ్చ జెప్పారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, భూ సమస్యలను కోర్టులో పరిష్కారం చేసుకోవాలని బాధితులకు సూచించడంతో లచ్చన్న కుటుంబీకులు తిరిగి వెళ్లిపోయారు.