ఎఫ్పీ షాపు డీలర్ల నిరసన బాట
ABN , First Publish Date - 2021-10-27T06:20:04+05:30 IST
గోనెసంచులను డీలర్లు తిరిగి ఉచితంగా ఇవ్వాలన్న ప్రభు త్వం నిర్ణయంపై ఎఫ్పీ షాపు డీలర్ల నిరసన బాట పట్టారు.
గోనె సంచులకు డబ్బు చెల్లించాలని డిమాండ్
అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 26: గోనెసంచులను డీలర్లు తిరిగి ఉచితంగా ఇవ్వాలన్న ప్రభు త్వం నిర్ణయంపై ఎఫ్పీ షాపు డీలర్ల నిరసన బాట పట్టారు. ఎఫ్పీ షాపు డీలర్ల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండల స్థాయి స్టాక్ పాయింట్ల వద్ద ఖాళీ గోనె సంచులతో మంగళవారం ఎఫ్పీ షాప్ డీలర్లు ధర్నా నిర్వహించారు. బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు తీసుకోకుండా నిరసన తెలియజేశారు. దీంతో ఎఫ్పీ షాపులకు నవంబరు నెలకు సంబంధించిన నిత్యావసర సరుకుల సరఫరా బంద్ అయ్యింది. అనంతపురం అర్బన, రూరల్ ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద ఎఫ్పీ షాపు డీలర్ల సంఘం నాయకులు బాలనాగిరెడ్డి, లాలప్ప, చంద్రశేఖర్, బాలకృష్ణ, తిరుపాల్ తదితరులు నిరసన వ్యక్తం చేశారు. మిగతా ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఆయా స్థానిక ఎఫ్పీ షాపు డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇదివరకు ఎఫ్పీ షాపుల నుంచి గోనె సంచులను ఎంఎల్ఎస్ పాయింట్లకు తిరిగి పంపే వారన్నారని, ఒక్కో గోనె సంచికి రూ.20లు ప్రభుత్వం అందిస్తూ వచ్చిందని అన్నారు. ఇప్పటి నుంచి ఉచితంగా గోనె సంచులు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం జీఓ జారీ చేసిందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.