ఎమ్మెల్యే ఫాల్గుణపై నిరసన గళం
ABN , First Publish Date - 2022-06-29T05:40:14+05:30 IST
ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తీరుపై వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
- తమను విస్మరిస్తున్నారంటూ పార్టీ సీనియర్ నాయకుల ఆవేదన
- కార్యకర్తలతో కలిసి ప్లీనరీ బహిష్కరణ
- వైసీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షుడికి ఫిర్యాదు
అరకులోయ, జూన్ 28: ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తీరుపై వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పని చేస్తున్న తమను విస్మరిస్తున్నారంటూ మంగళవారం నిర్వహించిన ప్లీనరీని బహిష్కరించారు. పార్టీ కార్యక్రమాల్లో తమను భాగస్వాములను చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరంతా ఆర్ అండ్ బీ అతిథి గృహం ప్రాంగణంలో సమావేశమయ్యారు. అనంతరం ప్లీనరీ జరిగిన ఓ ప్రైవేటు హోటల్ వద్దకు వారు వెళ్లి పార్టీ అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు పరిక్షిత్ రాజు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ప్లీనరీ పరిశీలకుడు బాలకృష్ణలకు తమ గోడు వినిపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి శక్తివంచన లేకుండా పని చేస్తున్న తమను ఎమ్మెల్యే ఫాల్గుణ దూరంగా ఉంచుతున్నారని, తీవ్రంగా అవమానిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెదబయలు ఎంపీపీ వరహాలమ్మ, హుకుంపేట మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కాసులమ్మ, మాజీ సర్పంచులు పి.చిన్నారావు, గుడివాడ ప్రకాశ్, గొల్లోరి ప్రసాద్, హెచ్బీ అప్పలరాజు, రఘునాథ్, వెంకట్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎస్.భాస్కరరావు, చందూ, సుందరరావు, టి.రాందాస్, సీనియర్ నాయకులు పి.విజయ్కుమార్, పి.ఆశోక్కుమార్, పి.పరుశురాం తదితరులు ఉన్నారు.