మందడం టిడ్కో గృహాల వద్ద దళిత జేఏసీ ధర్నా

ABN , First Publish Date - 2021-06-22T06:34:24+05:30 IST

మందడంలోని పేదల టిడ్కో గృహాల వద్ద రాజధాని దళిత జేఏసీ సభ్యులు సోమవారం ధర్నా నిర్వహించారు.

మందడం టిడ్కో గృహాల వద్ద దళిత జేఏసీ ధర్నా
ధర్నా చేస్తున్న దళిత జేఏసీ నాయకులు

తుళ్లూరు, జూన్‌ 21: మందడంలోని పేదల టిడ్కో గృహాల వద్ద రాజధాని దళిత జేఏసీ సభ్యులు సోమవారం ధర్నా నిర్వహించారు.  రాజధానిలో ఐదు వేల ఇళ్ల నిర్మాణాలు జరిగాయని, వాటిని పంపిణీ చేయటానికి ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. లబ్ధిదారులు తమ వాటాలను వడ్డీలకు తీసుకొచ్చి కట్టారన్నారు. టిడ్కో గృహసముదాయాల వద్ద మౌలిక వసతులు కల్పించి పంపిణీ చేయాల్సి ఉండగా ఆ ధ్యాసే ప్రభుత్వానికి లేదని దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌ పేర్కొన్నారు. ఎక్కడ టిడ్కో గృహాలు ఇస్తే గత ప్రభుత్వానికి పేరొస్తుందనే కుట్రతో సీఎం జగన్‌రెడ్డి పేదలకు ఇవ్వకుండా అట్టిపెట్టారన్నారు. అదేమంటే సెంటు స్థలం అంటూ మభ్యపెట్టారని పేర్కొన్నారు. రాజధానిలో పేదలకు నివాసయోగ్యం కలగనివ్వరా అంటూ ధ్వజమెత్తారు. నెలాఖరుకల్లా లబ్ధిదారులకు గృహాలను ఇవ్వాలని లేదంటే, గృహప్రవేశాలు జరుగుతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ముళ్లమూడి రవి,  దళిత జేఏసీ  నాయకులు బేతపూడి సుధాకర్‌,  పులి చిన్నా, జకరయ్య, ఎండ్లూరి వినయ్‌కుమార్‌, గోచిపాత రాంబాబు,  అచ్చియ్య,  వేమూరి వినయ్‌,  కంభంపాటి భాగ్యారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T06:34:24+05:30 IST