మహబూబా తీరును వ్యతిరేకిస్తూ జమ్మూలో ఆందోళనలు
ABN , First Publish Date - 2021-06-24T16:46:28+05:30 IST
జమ్మూ కాశ్మీర్ అంశంపై చర్చించే విషయంలో...
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అంశంపై చర్చించే విషయంలో పాకిస్థాన్ను కూడా భాగస్వామిగా చేయాలని మెహబూబా ముఫ్తీ చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా జమ్మూలో నిరసనలు మొదలయ్యాయి. ఈరోజు డోగ్రా ఫ్రంట్ అనే సంస్థ సభ్యులు జమ్మూలోని వీధుల్లోకి వచ్చి, మహబూబా ముఫ్తీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇలా వ్యాఖ్యానించినందుకు మహబూబాను జైలుకు తరలించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
పీడీపీ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ రోజు ఆమె కాశ్మీర్ సమస్యకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. ఆమెతో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడాన్నివ్యతిరేకించిన గుప్కర్ కూటమి నాయకులు కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు అంగీకరించారు. ఈ సమావేశానికి ఎనిమిది రాజకీయ పార్టీలకు చెందిన 14 మంది నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.