‘అగ్నిపథ్’ రద్దు కోసం రాజీలేని పోరాటం
ABN , First Publish Date - 2022-06-28T05:25:42+05:30 IST
దేశ రక్షణ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై, సైన్యంలో చేరేందుకు సమాయత్తమవుతున్న యువకుల ఆశలను అగ్నిపథ్ పథకం పేరుతో నరేంద్ర మోదీ ప్రభుత్వం అడియాశలు చేసిందని డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
- డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి
- గద్వాల రాజీవ్ సర్కిల్లో నిరసన దీక్ష
గద్వాల టౌన్, జూన్ 27 : దేశ రక్షణ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై, సైన్యంలో చేరేందుకు సమాయత్తమవుతున్న యువకుల ఆశలను అగ్నిపథ్ పథకం పేరుతో నరేంద్ర మోదీ ప్రభుత్వం అడియాశలు చేసిందని డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. రక్షణ బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అగ్నిపథ్ పథకం రద్దుకు తమ పార్టీ రాజీ లేని పోరాటం సాగిస్తుందన్నారు. పార్టీ పిలుపు మేరకు సోమవారం పట్టణంలోని రాజీవ్సర్కిల్లో ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి, గతంలో కొత్తసాగు చట్టాలతో కిసాన్లను రోడ్డుపైకి ఈడ్చిన నరేంద్ర మోదీ, ‘అగ్నిపథ్’ ఆలోచనతో భవిష్యత్ జవాన్లను రోడ్డుపై నిలబెట్టారని ధ్వజమెత్తారు. 22 ఏళ్ల వయస్సుకే యువశక్తిని శాశ్వత నిరుద్యోగులుగా మార్చే ఈ పథకంతో రక్షణ పరంగా దేశానికి ఎలాంటి ఉపయోగమూ లేదన్నారు. సమావేశంలో మాట్లాడిన పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇసాక్, దేశ రక్షణ కోసం పనిచేసే సైనికులను, కాంట్రాక్ట్ కార్మికులను మార్చే ప్రయత్నం చేస్తున్న నరేంద్రమోదీ విధానాలను దేశంలోని మేధావులు, విద్యావంతులు ముఖ్యంగా దేశభక్తులు ప్రశ్నించాలని కోరారు. దీక్షలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఉమాదేవి, సీనియర్ నాయకులు బల్గెర నారాయణ రెడ్డి, గిరిబాబు, గౌస్, నల్లారెడ్డి, శ్యాం, ఎంసీ నందు, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, బంగ్లా షాషా, కౌసర్బేగ్, అలెగ్జాండర్, రఘునాయుడు, రవి, ఇలియాస్, అజ్మత్, వీరేష్, రియాజ్, బీసన్న ఉన్నారు.