సర్కారు ఆస్తులకు రక్షణ కరువు

ABN , First Publish Date - 2022-05-23T06:05:33+05:30 IST

సర్కారు ఆస్తులకు రక్షణ కరువు

సర్కారు ఆస్తులకు రక్షణ కరువు
పట్టణ ప్రగతిలో బస్టాండ్‌ వెనుక కూల్చిన భవనాలు


  • ఆమనగల్లులో రక్షణ లేని  కోట్ల విలువైన స్థలాలు 
  • వినియోగించడంలో అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వం 
  • ఫెన్సింగ్‌కు నోచని బస్టాండ్‌ వెనుక స్థలం

ఆమనగల్లు ,మే 22:  కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోతుంది. సర్కారు ఆస్తుల రక్షణ , వినియోగం విషయంలో అధికారుల , ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తుంది. అసలే అనేక ప్రభుత్వ అవసరాలకు స్థలాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఉన్న స్థలాలను వినియోగంలోకి తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. ఆయా స్థ్థలాలను  వినియోగంలోకి తెస్తే ప్రజావసరాలకు , కార్యాలయాలు , విద్యాసంస్థలకు భవనాల సమస్య తొలిగిపోతుంది. ఆమనగల్లు పట్టణంలో అనేక చోట్ల ప్రభుత్వ స్థలాలు వృథాగా మారి వాటికి రక్షణ లేకుండా పోతుంది. ఆమనగల్లు బస్టాండ్‌ వెనుక భాగంలో మండల పరిషత్‌ ఆధీనంలో ఉన్న పాత ఆసుపత్రి సిబ్బంది క్వార్టర్స్‌ లో కొన్నింటిలో దశాబ్దం క్రితం వరకు కొందరు నివాసం ఉన్నారు. మరో రెండు క్వార్టర్లలో కొంత కాలం పీఏసీఎస్‌ కార్యాలయం నిర్వహించగా ఆ తర్వాత భవనం శిథిలావస్థకు చేరడంతో ఏడాది క్రితం మండల పరిషత్‌ ఆవరణలోని ఐకేపీ భవనంలోకి మార్చారు. దీంతో సుమారు 2000 గజాల స్థలంలో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరడంతో 2020 జూన్‌ 7న పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీ అధికారులు వాటిని కూల్చివేశారు. 90 శాతం పనిపూర్తి అయ్యాక జడ్పీటీసీ అనురాధఽపత్యనాయక్‌, ఎంపీటీసీ దోనాదుల కుమార్‌ , పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు మండల పరిషత్‌కు సమాచారం లేకుండా భవనాల కూల్చివేతపై అభ్యంతరం తెలిపి అట్టి స్థలంలో నిరసనకు దిగారు. దీంతో ఒకింత ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడం , పోలీసులు రంగ ప్రవేశ చేయడం జరిగింది. దీంతో కూల్చి వేసిన భవనాల మట్టి ని తొలగించకపోగా, పాత పీఏసీఎస్‌ భవనం ఒక వైపు గోడతో మిగిలిపోయింది. అట్టి స్థలం వినియోగించక నిరూపయోగంగా మారింది. మండల పరిషత్‌ ఆధీనంలోని బస్టాండ్‌ వెనుక భాగంలో గల స్థలాన్ని పరిరక్షించాలని, చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని పలువురు ఎంపీటీసీ సభ్యులు మండల సభలో పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో అధికారులు ఫెన్షింగ్‌కు రూ.94వేలతో ప్రతిపాదనలు రూపొందించి మున్సిఫల్‌ శాఖకు అనుమతికి నివేదించారు. కాగా నిధులు లేకపోవడం , మున్సిపల్‌ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం రాకపోవడంతో అట్టి స్థలం ప్రైవేట్‌ వాహనాల పార్కింగ్‌ కు ,మూగజీవాలకు , మలమూత్ర విసర్జనకు అడ్డాగా మారింది. ముందు భాగంలో ఉన్న ఉన్నత పాఠశాల భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. రెండు స్థలాలను వినియోగించి బస్టాండ్‌ ఉన్నత పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని స్థానికులు కోరుతున్న ఆదిశగా ప్రజాప్రతి నిధులు, అధికారులు చొరవ చూపడం లేదు. ఇదే స్థలాన్ని పండ్ల మార్కెట్‌ ఏర్పాటుకు కూడా మున్సిపాలిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. కాగా ప్రజావసరాలకు దేనికీ వినియోగించక కోట్ల విలువైన స్థలం నిరూపయోగంగా మారి కళాహీనంగా తయారైంది. స్థలం ఇలాగే వదిలేస్తే అన్యాక్రాంతమయ్యే ప్రమాదం లేకపోలేదని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. పోలీసు స్టేషన్‌ వెనుక భాగంలో బీసీ హాస్టల్‌కు చెందిన కోట్ల విలువైన స్థలం కూడా నిరుపయోగంగా ఉంది. నాలుగేళ్ల క్రితం బీసీ హాస్టల్‌ను ఎత్తివేయడంతో శిథిలావస్థకు చేరిన భవనం, స్థలం అసాంఘిక  కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. .  శ్రీశైలం - హైదరాబాద్‌ జాతీయ రహదారి అనుసరించి ఉన్న ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన స్థలం, భవనం కూడ వినియోగించక నిరూపయోగంగా ఉంది. కూరగాయల  మార్కెట్‌లో మాంస మార్కెట్‌ షెడ్డు వృథాగా మారింది. 

ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. కోట్ల విలువైన స్థలాలు , భవనాలు వృఽథాగా వదిలేస్తే అవి అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రభుత్వ స్థలాల చుట్టూ పెన్సింగ్‌ ఏర్పాటు చేసి కాపాడాలి. ఆమనగల్లు మండల పరిషత్‌ ఆధీనంలో ఉన్న బస్టాండ్‌ వెనుక భాగంలోని స్థలాన్ని ప్రజావసరాలకు వినియోగించాలి. అప్పటి వరకు స్థలానికి రక్షణ గా పెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి.

                                       - మండ్లీ రాములు,  కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఆమనగల్లు 

ప్రతిపాదనలు రూపొందించాం

మండల పరిషత్‌ ఆధీనంలో ఉన్న బస్టాండ్‌ ఉన్నత పాఠశాల వెనుక భాగంలోని స్థలానికి రక్షణ చర్యలు చేపట్టాం. మండల పరిషత్‌ సభ్యులు, స్థానికుల విన్నపం మేరకు అట్టి స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటుకు రూ.94వేలతో ప్రతిపాదనలు రూపొందించాం. మున్సిఫల్‌ శాఖ నుంచి అనుమతి రాగానే నిధుల మంజూరుకు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వీలైనంత త్వరగా స్థలం చుట్టు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ స్థలాలను ఎక్కడ ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తప్పవు.

                                                            -వెంకట్రాములు , ఎంపీడీవో  ఆమనగల్లు 

Updated Date - 2022-05-23T06:05:33+05:30 IST