హోమ్ ఐసొలేషన్కు ప్రోత్సహించండి
ABN , First Publish Date - 2020-07-04T10:07:57+05:30 IST
కరోనా పాజిటివ్ కేసుల్లో తేలికపాటి లక్షణాలున్నవారిని, లేని వారిని తప్పనిసరిగా హోమ్ ఐసొలేషన్లో ఉండేలా ప్రోత్స
అధికారులకు కలెక్టర్ ఆదేశం
అనంతపురం, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : కరోనా పాజిటివ్ కేసుల్లో తేలికపాటి లక్షణాలున్నవారిని, లేని వారిని తప్పనిసరిగా హోమ్ ఐసొలేషన్లో ఉండేలా ప్రోత్స హించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జేసీ డాక్టర్ సిరితో కలిసి డీఎంహెచ్ఓ, అదనపు డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎ్స, ఇతర వైద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో చాలా మందికి లక్షణాలు లేనందున ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించాల్సిన అవసరం లేన్నట్టు గమనించామన్నారు.
అలాంటి వారిని ఇంటి వద్ద హోమ్ ఐసొలేషన్లో ఉంచి చికిత్స అందించవచ్చన్నారు. ప్రస్తుతం తేలికపాటి లక్షణాలున్న వారిని, లక్షణాలు లేని వారిని ఇలా అందర్నీ ఆస్పత్రికి పంపే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఎక్కువ శాతం బాధితులు తమను ఆస్పత్రిలోనే ఉంచాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. వైద్యాధికారులు ఈ విషయంలో రిస్కు తీసుకోవడం ఎందుకని వారిని ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారన్నారు. తద్వారా 60 ఏళ్లు పైబడిన వారు, ఇతర వ్యాధి లక్షణాలున్న వారికి అత్యవసర చికిత్స అందించాల్సిన సమయంలో డాక్టర్లు, వనరులు చాలక వైద్య సదుపాయం కల్పించేందుకు వీలుకాకపోవచ్చన్నారు. ఈ పరిస్థితుల్లో హోమ్ ఐసొలేషన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంట్లోనే ఉంటూ మందులు వాడేలా వారిని ప్రోత్సహించాలన్నారు. లేదంటే కొవిడ్ సెంటర్కు పంపాలన్నారు.