కరోనా తీవ్రత నేపథ్యంలో.. చైనా కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-02-25T10:28:37+05:30 IST

కరోనా తీవ్రత నేపథ్యంలో దేశంలో వన్యప్రాణి విక్రయం, భక్షణను నిషేధిస్తూ చైనా సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో దేశ అత్యున్నత నిర్ణాయక మండలి నేషనల్‌

కరోనా తీవ్రత నేపథ్యంలో.. చైనా కీలక నిర్ణయం

చైనాలో వన్యప్రాణి మాంసంపై నిషేధం

కరోనా ప్రభావం నేపథ్యంలో నిర్ణయం

దేశంలో 2,600 దాటిన వైరస్‌ మరణాలు 


బీజింగ్‌, న్యూఢిల్లీ, సియోల్‌, ఫిబ్రవరి 24: కరోనా తీవ్రత నేపథ్యంలో దేశంలో వన్యప్రాణి విక్రయం, భక్షణను నిషేధిస్తూ చైనా సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో దేశ అత్యున్నత నిర్ణాయక మండలి నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌పీసీ) ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని అధికారిక టీవీ చానల్‌ పేర్కొంది. అధిక మోతాదులో వన్యప్రాణి భక్షణ సమస్యలకు దారితీస్తోందని ప్రకటించింది. మరోవైపు కొవిడ్‌-19 కారణంగా ఆ దేశంలో మృతుల సంఖ్య 2,592కు చేరింది. వైరస్‌ నిర్ధారిత కేసుల సంఖ్య 77 వేలు దాటింది. వైరస్‌ కేంద్ర స్థానం వూహాన్‌లో జన సంచారంపై ఆంక్షలను పరిమితంగా సడలించారు. కాగా.. నిర్ధారిత కేసులు 79 వేలు దాటినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది.


మహమ్మారి స్థాయి ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధానమ్‌ దేశాలకు పిలుపునిచ్చారు. చైనా అనుమతి ఇవ్వడంతో మందులు, వైద్య పరికరాలతో కూడిన భారత విమానం ఈ నెల 26న బయల్దేరనుంది. జపాన్‌ తీరంలోని నౌకలో మరో ఇద్దరు భారతీయులు కొవిడ్‌-19 బారినపడ్డారు. దక్షిణ కొరియాలో వైరస్‌ విజృంభిస్తోంది. మృతుల సంఖ్య ఏడుకు చేరింది. కేసుల సంఖ్య 800 దాటింది. సోమవారమే ఇద్దరు చనిపోగా కొత్తగా 161 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌తో తమ దేశంలో 12 చనిపోయినట్లు ఇరాన్‌ అధికారికంగా తెలిపింది. నెలలో 50 మంది మృతి చెందారన్న ఖ్వామ్‌ నగర ప్రజాప్రతినిధి ప్రకటనను ఖండించింది. ఇరాక్‌, బహ్రెయిన్‌, కువైత్‌లోనూ తొలి వైరస్‌ నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-02-25T10:28:37+05:30 IST