మూడేళ్లుగా రూ.కోటికి పైగా లాభాలు
ABN , First Publish Date - 2022-10-01T05:11:35+05:30 IST
‘కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు లిమిటెడ్ మూడేళ్లుగా కోటి రూపాయలకు పైగా లాభాలను గడిస్తోంది. వాటాదారులు, పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది, ఖాతాదారుల సమష్టి సహకారంతో ఈ యేడుకూడా కోటి రూపాయలకు పైగా లాభం వస్తుందని ఆశిస్తున్నాం... వరుసగా నాలుగో సంవత్సరం కోటి లాభం వస్తే మరో బ్రాంచీని ప్రారంభించే అవకాశం వస్తుంది. జమ్మికుంటలో కొత్త బ్రాంచీని అందరి సహకారంతో ప్రారంభిస్తాం’ అని అదనపు కలెక్టర్, బ్యాంకు పర్సన్ ఇన్చార్జి చైర్మన్ జీవీ శ్యాంప్రసాద్లాల్ అన్నారు.
- ఈ యేడు కోటి లాభం వస్తే కొత్త బ్రాంచికి అనుమతి
- త్వరలో ఏటీఎం, డిపాజిట్ యంత్రాలు
- ఆర్బీఐ అనుమతి రాగానే వాటాదారులకు డివిడెండ్
- అర్బన్ బ్యాంకు మహాజన సభలో పర్సన్ ఇన్చార్జి, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్
కరీంనగర్ టౌన్, సెప్టెంబరు 30: ‘కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు లిమిటెడ్ మూడేళ్లుగా కోటి రూపాయలకు పైగా లాభాలను గడిస్తోంది. వాటాదారులు, పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది, ఖాతాదారుల సమష్టి సహకారంతో ఈ యేడుకూడా కోటి రూపాయలకు పైగా లాభం వస్తుందని ఆశిస్తున్నాం... వరుసగా నాలుగో సంవత్సరం కోటి లాభం వస్తే మరో బ్రాంచీని ప్రారంభించే అవకాశం వస్తుంది. జమ్మికుంటలో కొత్త బ్రాంచీని అందరి సహకారంతో ప్రారంభిస్తాం’ అని అదనపు కలెక్టర్, బ్యాంకు పర్సన్ ఇన్చార్జి చైర్మన్ జీవీ శ్యాంప్రసాద్లాల్ అన్నారు. శుక్రవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన బ్యాంకు మహాజన సభకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు పాలకవర్గం, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ఖాతాదారులు, సభ్యుల సహకారంతో బ్యాంకు లాభాలు సాధిస్తోందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు 1.76 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిందన్నారు. పాలకవర్గం ఎన్నికలకు ఎప్పుడు వ్యతిరేకం కాదని, కోర్టు కేసులు, కొవిడ్ వంటి కారణాలతో ఎన్నికలు ఆలస్యమయ్యాయన్నారు. ఇటీవల కోర్టు కేసు విషయంలో కొంత పురోగతి ఉందని, ఆ సమస్య పరిష్కారం కాగానే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. వాటాదారులకు డివిడెండ్ ఇచ్చేందుకు 25 లక్షల రూపాయలను కేటాయించామని, రిజర్వుబ్యాంకు అనుమతి ఇవ్వగానే డివిడెండ్ పంపిణీ చేస్తామని అన్నారు. ఆధార్ కార్డు సమర్పించని వాటాదారుల పేర్లను తొలగించామని, ఇంకా ఆధారుకార్డును సమర్పించి పేర్లు చేర్చుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా సీఈవో నునుగొండ శ్రీనివాస్ ప్రవేశపెట్టిన 2021-21 ఆర్థిక సంవత్సరం ఆడిట్ రిపోర్టును, అంచనా బడ్జెట్ను ఆమోదించారు. బ్యాంకు సభ్యులు వూకంటి రాధాకృష్ణారెడ్డి, బొమ్మరాతి రాంచంద్రం, మడుపు మోహన్, తాటికొండ భాస్కర్, ఎలగందుల మల్లేశం, మంచాల సత్యనారాయణ, కల్యాడపు ఆగయ్య పాలకవర్గ ఎన్నికలు నిర్వహించాలని, మహాజన సభకు కోరం లేదంటూ నామమాత్రంగా సమావేశాలు నిర్వహించడమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో పాలకవర్గసభ్యులు అర్ష మల్లేశం, కర్ర సూర్యశేఖర్, దిండిగాల మహేశ్, ఎడబోయిన శ్రీనివాస్రెడ్డి, గంజి అంజయ్య, జగిత్యాల బ్రాంచి మేనేజర్ ఎలుక సుధాకర్తోపాటు బ్యాంకు సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.