కొత్త సర్పంచ్కు సమస్యల స్వాగతం
ABN , First Publish Date - 2021-02-25T05:46:57+05:30 IST
ఆలూరు మేజర్ గ్రామ పంచాయతీలో గురువారం కొత్త సర్పంచ్ అరుణదేవి గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు.
- వేధిస్తున్న డ్రైన్, తాగునీటి కొరత
- విచ్చలవిడిగా పందుల సంచారం
- గుట్టుగా అక్రమ కొళాయి కనెక్షన్లు
- ఆలూరు పంచాయతీలో అన్నీ సమస్యలే
ఆలూరు, ఫిబ్రవరి 24: ఆలూరు మేజర్ గ్రామ పంచాయతీలో గురువారం కొత్త సర్పంచ్ అరుణదేవి గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెకు పంచాయతీలోని అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఆలూరు పట్టణంలో 13 వేలకు పైగా జనాభా ఉంది. రూఅర్బన్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రైన్ నిర్మాణానికి రూ.11 కోట్లు మంజూరయ్యాయి. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు పనులు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో రెండేళ్ల క్రితం ఆ పనులు మరుగున పడిపోయాయి. దీంతో ఆలూరు పట్టణంలో కోయనగర్, ఎస్సీ కాలనీ, ఇందిరానగర్, కోటవీధి, సంత మార్కెట్ ప్రాంతంలో డ్రైన్లు లేవు. విచ్చిలవిడిగా వీధుల్లో పందుల తిరుగుతున్నాయి. పట్టణంలో 12 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా అవుతోంది. పంచాయతీ స్థలాలను కొందరు దర్జాగా ఆక్రమించుకొని బంకులు వేసుకొని వేలాది రూపాయలకు అద్దెలు తీసుకుంటున్నారు. అరికెర రోడ్డు, బస్టాండు వెనుక, గుంతకల్ క్రాస్ వద్ద ఇలాంటి ఆక్రమణలు కనిపిస్తాయి. అక్రమ కొళాయి కనెక్షన్లు, సక్రమంగా ట్యాక్స్లు చెల్లించక పోవడం మొదలైన సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో పార్కింగ్ లేకుండా వ్యాపార సముదాయాలు నిర్మించడం, బస్టాండులో చిరు వ్యాపారులు రోడ్లపైనే కూరగాయలు, పండ్లు అమ్ముతుండటం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యలను సర్పంచ్ అరుణ దేవి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.