సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-10-08T06:26:17+05:30 IST
తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్రనేత ధరణికోట నర్సింహ డిమాండ్ చేశారు. దివ్యాంగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.
కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల నిరసన
భువనగిరి రూరల్, అక్టోబరు7: తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్రనేత ధరణికోట నర్సింహ డిమాండ్ చేశారు. దివ్యాంగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల స్లాట్ బుకింగ్ కాలపరిమితి మూడు నెలలకు పెంచాలన్నారు. గత మూడేళ్లుగా అమలులో ఉన్న మూడు నెలల స్లాట్ బుకింగ్ కాల పరిమితిని ప్రస్తుతం నెలకు కుందించారని, ఇది సరైన నిర్ణయం కాదన్నారు. ఒక నెల కాలపరిమితి కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం డీఆర్డీవో మందడి ఉపేందర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పోరాట సమితి ప్రతినిధులు జాగిళ్లపురం అయిలయ్య, గుజ్జ అశోక్, సుంగారం రమేశ్, మచ్చ ఉపేందర్, నాగరాణి తదితరులున్నారు.