తాగునీటికి విద్యార్థుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-08-19T04:52:40+05:30 IST

నేటి విద్యార్థులే రేపటి భవితకు బాటలు అంటూ నాడు- నేడు కింద పాఠశాల రూపురేఖలే మార్చేశామంటూ ప్రభుత్వం ఎంతో గొప్పలు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అవి అమలు కావడం లేదు. మండలంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌ ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

తాగునీటికి విద్యార్థుల ఇక్కట్లు
ఇంటి నుంచి తెచ్చుకున్న వాటర్‌ బాటిల్స్‌తో భోజనం చేస్తున్న విద్యార్థినీలు

తీవ్ర ఇబ్బందుల్లో చిన్నారులు

చిన్నమండెం, ఆగస్టు 18: నేటి విద్యార్థులే రేపటి భవితకు బాటలు అంటూ నాడు- నేడు కింద పాఠశాల రూపురేఖలే మార్చేశామంటూ ప్రభుత్వం ఎంతో గొప్పలు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అవి అమలు కావడం లేదు. మండలంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌ ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 700 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 2019లో మండలానికి చెందిన ముల్లంగి నారాయణశెట్టి, లలితమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పాఠశాలకు ఆర్‌.ఓ. ప్లాంటు అందజేశారు. ప్రస్తుతం అది మరమ్మతులకు గురికావడంతో విద్యార్థులకు తాగేందుకు మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. నాడు- నేడు కింద మొదటి విడతలోనే ఈ స్కూల్‌ను ఎంపిక చేసి రూ.42 లక్షల 65 వేలు మంజూరు చేశారు. కానీ విద్యార్థులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలన్న ఆలోచన కానీ, ఆర్‌.ఓ.ప్లాంటును మరమ్మతు చేద్దామని కానీ అనుకోలేదు. తద్వారా పాఠశాల విద్యార్థులు ఇంటి నుంచి బాటిళ్లలో మంచినీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాక హాస్టల్‌లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతూ ఉన్న నీటినే తాగుతున్నారు. 


రూ.30 వేలు ఖర్చు అవుతుందన్నారు  

- రమేష్‌, ప్రిన్సిపాల్‌

మంచినీటి శుద్ధి పరికరాలు మొరాయించాయి. టెక్నీషియన్‌ను పిలిపించి చూపించగా దాదాపు రూ.30 వేలు అవుతుందని తెలిపారు. గతంలో సీఎఫ్‌ఎంఎస్‌, పీడీఎఫ్‌ అకౌంట్లు ఉండేవి. వాటిని ప్రభుత్వం బ్లాక్‌ చేసి యూనియన్‌ బ్యాంకులో పీఎ్‌ఫఎంఎస్‌ కింద అకౌంట్లు తెరచాలని సూచించడంతో అకౌంట్‌ కూడా ఓపెన్‌ చేశాం. నిధులు లేని కారణంతో చేయలేకపోతున్నాం. ఇదే విషయమై సర్పంచ్‌ దృష్టికి తీసుకెళ్లగా త్వరలో తమ నిధులతో చేయిస్తామని తెలిపారు. 

Updated Date - 2022-08-19T04:52:40+05:30 IST