జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-05-17T05:58:23+05:30 IST
చాలీచాలనీ వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వారి సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు.
సిరిసిల్ల కలెక్టరేట్, మే 16: చాలీచాలనీ వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వారి సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. సీఐటీయూ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. . కలెక్టరేట్ ఏవో గంగయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో కార్మికులకు వేతనాలను పెంచుతున్నట్లుగా ప్రకటించినా ఇంతవరకు ఇవ్వడం లేదన్నారు. గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మల్యాల నర్సయ్య, దుండ్రపల్లి రవీందర్, బుర్ర శ్రీనివాస్, జెల్లి లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.
మరమగ్గాలపై కాటన్ చీరలు తయారు చేసేవారిపై చర్యలు తీసుకోవాలి
సిరిసిల్లలో మరమగ్గాలపై కాటన్ చీరలను తయారు చేస్తున్న యజమానులపై చేనేత రిజర్వేషన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ సీఐటీయూ అధ్వర్యంలో కార్మికులు, ఆసాములు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, కాటన్ చీరల తయారీ కార్మిక సంఘం అఽధ్యక్షుడు వడ్నాల వీరేశం. సూర్య నారాయణ, నల్ల మార్కండేయులు, రమణ పాల్గొన్నారు.
బీజేపీకి బుద్ధి చెప్పాలి
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో మత రాజకీయాలను సృష్టిస్తోందని, అన్ని వర్గాల ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము కోరారు. మైనార్టీల రిజర్వేషన్లను తగ్గిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడంతో సోమవారం సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సిరిసిల్ల -వేములవాడ ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనార్టీల కోసం దివగంత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 4 శాతం రిజర్వేషన్లను కల్పించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఅర్ హామీ ఇచ్చి విస్మరించారన్నారు. జిల్లా అధికార ప్రతినిధి అనుముల శ్రీకాంత్ రెడ్డి, సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు మ్యాన లక్ష్మీనారాయణ, గుండేటి శేఖర్, కడుదుల నాగరాజు, జింక ఎల్లయ్య, మహిపాల్, కదిరే అనిల్, కర్ణుకార్ పాల్గొన్నారు.