షుగర్ మిల్స్ కుంభకోణంపై అమిత్షాకు హజారే లేఖ
ABN , First Publish Date - 2022-01-25T16:55:40+05:30 IST
మహారాష్ట్రలోని షుగర్ ఫ్యాక్టరీల అమ్మకాలలో రూ.25,000 కోట్ల మేరకు అవకతవకలు...
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని షుగర్ ఫ్యాక్టరీల అమ్మకాలలో రూ.25,000 కోట్ల మేరకు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ప్రముఖ గాంధేయవాది, సామాజిక ఉద్యమ కార్యకర్త అన్నా హజారే లేఖ రాశారు. ఈ అవకతవకలపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆ లేఖలో హజారా కోరారు.
షుగర్ కో-ఆపరేటివ్లను ప్రైవేటు సంస్థలకు అమ్మడంలో రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారుల పాత్ర ఉందని హజారే ఆరోపించారు. కార్పొరేట్ రంగాన్ని ప్రైవేటుపరం కాకుండా రక్షించడానికి నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు కేంద్రం ప్రయత్నించినప్పటికీ 47 షుగర్ ఫ్యాక్టరీలు ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసారని అన్నారు. అక్రమ రుణాల భారంతోనే ఆయా ఫ్యాక్టరీల ఆర్థిక పరిస్థితి బలహీనమైందని, దీంతో తక్కువ ధరలకే వాటిని అమ్మేశారని ఆ లేఖలో హజారే పేర్కొన్నారు.