సీఎం చన్నీ ఉద్దేశం వేరు: ప్రియాంక వివరణ

ABN , First Publish Date - 2022-02-17T21:53:33+05:30 IST

పంజాబ్‌ను పంజాబీలు మాత్రమే పాలించాలనే ఉద్దేశంలో చన్నీ వ్యాఖ్యానించారు. కానీ ఆయన మాటలను కొందరు కావాలని వక్రీకరిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యూపీ నుంచి అయినా బిహార్ నుంచి అయినా ఇంకెక్కడినుంచైనా పంజాబ్‌కు ఎవరైనా రావొచ్చు..

సీఎం చన్నీ ఉద్దేశం వేరు: ప్రియాంక వివరణ

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ సోదరులను పంజాబ్‌లో అడుగు పెట్టనివ్వబోమంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ తీవ్ర వివాదానికి దారి తీశాయి. చన్నీ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రియాంక తనకు తాను యూపీ కూతురిగా చెప్పుకొంటారని, మరోవైపు చన్నీ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విమర్శించారు. పంజాబేతరులైన సంత్ రవిదాస్, గురు గోవింద్ సింగ్‌లను అవమానించారంటూ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం మాటల దాడికి దిగారు.


ఇక, ఉత్తరప్రదేశ్‌కు ద్రోహం చేసింది బీజేపీయేనని ప్రియాంక విమర్శలు గుప్పించారు. రైతులను కారుతో తొక్కించి చంపించిన వ్యక్తిని జైలు నుంచి బయటికి తీసుకురావడమే కాకుండా వారి కుటుంబ సభ్యుల్ని మంత్రులుగా కొనసాగించడం రైతులను అవమానించడమేనని ఆమె అన్నారు. రైతులు ఆందోళన చేస్తుంటే ఒక్కసారి కూడా పట్టించుకోని మోదీ.. ఎన్నికలు రాగానే పంజాబ్‌కు యూపీకి వాలిపోతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో నిరుద్యోగం, ఆర్థికమాంద్యం గరిష్ఠ స్థాయిని దాటి పెరిగిపోతుంటే మోదీ మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లే పనిలో ఉన్నారని ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు.


విమర్శలు పెద్ద ఎత్తున వస్తుండడంతో చన్నీ వ్యాఖ్యలను సరిదిద్దేందుకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రయత్నించారు. చన్నీ ఉద్దేశం అది కాదని, ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ గురువారం ఆమె వివరణ ఇచ్చారు. ‘‘పంజాబ్‌ను పంజాబీలు మాత్రమే పాలించాలనే ఉద్దేశంలో చన్నీ వ్యాఖ్యానించారు. కానీ ఆయన మాటలను కొందరు కావాలని వక్రీకరిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యూపీ నుంచి అయినా బిహార్ నుంచి అయినా ఇంకెక్కడినుంచైనా పంజాబ్‌కు ఎవరైనా రావొచ్చు’’ అని అన్నారు.

Updated Date - 2022-02-17T21:53:33+05:30 IST