ఐసోలేషన్లో Priyanka Gandhi..ఎన్నికల ప్రచార సభలు రద్దు
ABN , First Publish Date - 2022-01-04T13:34:09+05:30 IST
తన కుటుంబంలో ఒకరితోపాటు వ్యక్తిగత సిబ్బందిలో మరొకరికి కొవిడ్ సోకడంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధి వాద్రా ఐసోలేషన్లోకి వెళ్లారు....
న్యూఢిల్లీ: తన కుటుంబంలో ఒకరితోపాటు వ్యక్తిగత సిబ్బందిలో మరొకరికి కొవిడ్ సోకడంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధి వాద్రా ఐసోలేషన్లోకి వెళ్లారు.యూపీతోపాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార పర్వంలో ఉన్న ప్రియాంకగాంధీకి కరోనా ఐసోలేషన్ ఆటంకంగా మారింది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శ్రీనగర్, అల్మోరా నగరాల్లో జరిగే బహిరంగసభలను రద్దు చేసుకున్నారు. ‘‘నా కుటుంబంలోని ఒక సభ్యుడికి, నా సిబ్బందిలో ఒకరికి నిన్న కొవిడ్-19కి పాజిటివ్ అని తేలింది. ఈరోజు నాకు నెగెటివ్ అని తేలింది, నన్ను ఐదురోజులపాటు ఐసోలేషన్లో ఉండి కొన్ని రోజుల తర్వాత మళ్లీ కరోనా పరీక్ష చేయించమని డాక్టర్ సలహా ఇచ్చారు" అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంపై పడనుంది. మరో వైపు కరోనా థర్డ్ వేవ్ కట్టడికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను ఆదేశించింది. దేశంలో గత 24 గంటల్లో 33,750 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో 123 మంది కరోనాతో మరణించారు.మహారాష్ట్ర, ఢిల్లీలలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య అధికంగా నమోదైంది.