ప్రైవేట్ టీచర్లకు కరోనా ప్యాకేజీ ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-04-23T06:39:36+05:30 IST
ప్రైవేటు టీచర్లకు తెలంగాణాలో ఇచ్చిన విధంగా కరోనా ప్యాకేజీ అందజేయాలని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు డిమాండ్ చేశారు.
నెలకూ.10 వేలు చెల్లించాలి : మాజీ ఎంపీ కొనకళ్ల
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 22 : ప్రైవేటు టీచర్లకు తెలంగాణాలో ఇచ్చిన విధంగా కరోనా ప్యాకేజీ అందజేయాలని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు డిమాండ్ చేశారు. తన కార్యాలయంంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దడంలో ప్రైవేటు టీచర్ల సేవలు గణనీయమన్నారు. అయితే కరోనా కష్టకాలంలో ప్రైవేటు పాఠశాలలు సరిగా నడవక పోవడం వల్ల ఉపాధి కోల్పోయారన్నారు. కుటుంబ పోషణ జరగక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది ప్రైవేటు ఉపాఽధ్యాయులు చనిపోయినా ముఖ్యమంత్రి జగన్ మనస్సు కరగడం లేదన్నారు. ప్రైవేటు టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వ అండగా లేక పోవడం దురదృష్ట కరమన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణాలో అక్కడి ప్రభుత్వం ప్రైవేటు టీచర్లకు నెలకు రెండు వేల నగదు, 25 కిలోల బియ్యం ఇస్తోందన్నారు. ఇదే విధంగా మిగిలిన రాష్ట్రాలు ప్రైవేటు టీచర్లను ఆదుకుంటున్నాయన్నారు. ఈవిషయమై సీఎం జగన్కు టీడీడీ నేత అచ్చెన్నాయుడు లేఖ రాశారన్నారు. ప్రైవేటు టీచర్లకు కరోనా ప్యాకేజీ కింద నెలకు రూ.10 వేలు, బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణం ఇవ్వాలన్నారు. ప్రైవేటు టీచర్ల సంఘ నాయకుడు బి అయ్యప్ప స్వామి తమ సమస్యలను కొనకళ్లకు వివరించారు. టీడీపీ నాయకులు బత్తిన దాసు , పివిఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.