కిడ్నాప్ చేద్దామనుకున్న టీచర్కు షాకిచ్చిన పనిమనిషి
ABN , First Publish Date - 2020-02-18T01:34:49+05:30 IST
కిడ్నాప్ చేసి భారీగా డబ్బు దండుకుందామనుకున్న టీచర్ పనిమనిషి దెబ్బకు పోలీసులకు చిక్కింది.
న్యూఢిల్లీ: కిడ్నాప్ చేసి భారీగా డబ్బు దండుకుందామనుకున్న ఓ టీచర్.. పనిమనిషి దెబ్బకు పోలీసులకు చిక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీకి చెందిన ఓ మహిళ ప్రైవేటు టీచర్గా పనిచేస్తోంది. ఆమె ఇటీవల కిడ్నాప్ చేసి డబ్బు సంపాదిద్దామని డిసైడైంది. ఈ క్రమంలో సఫ్దర్గంజ్ ఎన్క్లేవ్లోగల అపార్ట్మెంట్లో ఓ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంది. శనివారం మధ్యాహ్నం ఎంచుకున్న ఆ ఫ్లాట్ వద్దకెళ్లి తలుపు కొట్టింది. ఆ సమయంలో ఇంట్లో అనితా మిట్టల్, ఆమె మనవడు(తొమ్మిది నెలలు), పనిమనిషి మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో తలుపు తీసిన అనితపై ఆ టీచర్ కత్తితో దాడి చేసింది. ఆమె చేతిలో ఉన్న మనవడిని తీసుకుని పారిపోయే ప్రయత్నం చేసింది. ఇది చూసిన అనిత.. పెద్ద పెట్టున అరవడంతో అప్రమత్తమైన పనిమనిషి ఆమెను అడ్డుకుంది. పెద్దగా కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. ఈలోపు ఆ టీచర్.. పనిమనిషి నుంచి తప్పించుకుని అపార్ట్మెంట్ గేటు వైపు పరుగు తీసింది. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకుని పసివాడిని విడిపించారు. అనంతరం టీచర్ను పోలీసులకు అప్పగించారు.