Ap Highcourt Serious Govt: గత ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు
ABN , First Publish Date - 2022-09-02T04:00:16+05:30 IST
ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం కేటాయించాలని..
అమరావతి (Amaravati): ప్రైవేటు పాఠశాలల్లో (Private Schools) పేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించకపోవడంపై హైకోర్టు సీరియస్ (high court Serious) అయింది. ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం కేటాయించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు అమలు చేయకపోవడంతో న్యాయవాది తాండవ యోగేష్.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. విద్యాహక్కు చట్టం కింద ఈ ఏడాది 25 శాతం సీట్లు ఎందుకు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్ధులు స్కూల్లో అయినా ఉండాలని.. లేదంటే తమరైనా జైల్లో అయినా ఉండాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో పాటు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిని తీవ్రంగా హెచ్చరించింది.
ఇక ప్రభుత్వం వేసిన అఫిడవిట్పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మాటలు చెప్పడం కాదని...రుజువులు చూపించాలని సూచించింది. నిరుపేద విద్యార్ధుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని మండిపడింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులు అమలుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైందని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వివరాలు అందించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.