చికిత్స పేరుతో దోచుకుంటున్నారు..
ABN , First Publish Date - 2021-05-15T06:20:39+05:30 IST
చికిత్స పేరుతో దోచుకుంటున్నారు..
ఓసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు రామారావు
న్యూశాయంపేట, మే 14 : ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పేరిట దోపిడీకి పాల్పడుతున్నారని, ఆ దారుణాలు ప్రభుత్వానికి కనిపంచడం లేదా అని ఓసీ సామాజిక సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రశ్నించారు. శుక్రవారం హంటర్రోడ్లోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా సంక్షోభంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత కారణంగా సరైన వైద్యం అందడం లేదని ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు వెచ్చించలేని పేదలు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్ర నాయకులకు ఈ పరిస్థితి కనిపించట్లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం కొంత కాలం తమ ఆధీనంలోకి తీసుకొని పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పేదలు, అసంఘటిత కార్మికులు, చిరువ్యాపారులకు నెలకు కనీసం రూ.6వేల భృతితోపాటు, నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సంక్షోభ సమయంలో యుద్ధప్రాతిపదికన అన్ని గ్రామాలు, తండాల్లో మొబైల్ వాహనాల ద్వారా కరోనా పరీక్షలు చేయించి అవసరమైన చికిత్సను ఉచితంగా అందించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్రెడ్డి, నాయకులు నల్లా రాజిరెడ్డి, దుబ్బా శ్రీనివాస్ పాల్గొన్నారు.