కోకాపేట్​ భూముల పేరుతో ప్రైవేటు ప్రకటనలు

ABN , First Publish Date - 2021-06-27T00:26:18+05:30 IST

హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్‌‌మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ)ఆధ్యర్యంలో కోకాపేట్​ లే

కోకాపేట్​ భూముల పేరుతో ప్రైవేటు ప్రకటనలు

 హైదరాబాద్​:  హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్‌‌మెంట్​ అథారిటీ(హెచ్ఎండీఏ)ఆధ్యర్యంలో కోకాపేట్​ లే అవుట్‌లో భూముల​ ఈ‌‌‌‌ – ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దీనిని సాకుగా చూపి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ‘సీఎన్ఎన్​ వెంచర్స్​’ అనే సంస్థపై సెంట్రల్​ క్రైమ్​ స్టేషన్​(సీసీఎస్​) పోలీసులు ఎఫ్ఐఆర్​(104/2021) నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్​టీసీ లిమిటెడ్ ద్వారా జరుగుతున్న కోకాపేట్​ భూముల ఈ–ఆక్షన్​ ప్రక్రియ పూర్తికాకముందే ప్రజలను మభ్యపెట్టేవిధంగా సదరు సీఎన్ఎన్​ వెంచర్స్​ కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది.


అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి వంచనకు గురిచేస్తున్న తీరును హెచ్​ఎండిఏ తీవ్రంగా పరిగణించింది. కోకాపేట్​ భూములను మార్కెట్​ విలువలో యాబై శాతం(50%) పెట్టుబడులతో 1,500 చదరపు అడుగుల వరకు 3బీహెచ్​కె  ఫ్లాట్‌‌లను సొంతం చేసుకోవచ్చని సీఎన్ఎన్​ వెంచర్స్​ ప్రకటనల ద్వారా  అమాయక ప్రజలను వంచనకు గురిచేస్తున్నది. 




ఒకవైపు కోకాపేట్​ భూముల ఈ–ఆక్షన్​ ప్రక్రియ కొనసాగుతుండగానే, తక్కువ ధరలకు/రేట్లకు పెట్టుబడులు పెట్టి 3బీహెచ్​కె ఫ్లాట్లను కొనుగోలు చేసుకోవచ్చని సామాన్య ప్రజానీకాన్ని ప్రభావితం చేసే విధంగా సీఎన్ఎన్ వ్యవహరించింది. ప్రజల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న సీఎన్ఎన్​ వెంచర్స్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ సెక్రెటరీ,  ఔటర్​ రింగ్​ రోడ్డు(ఓఆర్ఆర్)​ ప్రాజెక్టు డైరెక్టర్​ సంతోష్​ ఐఏఎస్​ శుక్రవారం నగర పోలీస్​ కమిషనర్​‌కు ఫిర్యాదు చేశారు.


హెచ్ఎండీఏ  భూముల వేలం పూర్తికాకముందే నిర్ణిష్టమైన అనుమతులు లేకుండానే అమాయక ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్న సీఎన్ఎన్​ వెంచర్స్​ పై కఠిన చర్యలు తీసుకుని హెచ్ఎండీఏ ప్రతిష్టతను కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాపార ప్రకటనలను, లావాదేవీలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు విశ్వసించరాదని హెచ్ఎండీఏ సూచించింది. 

Updated Date - 2021-06-27T00:26:18+05:30 IST