కోకాపేట్ భూముల పేరుతో ప్రైవేటు ప్రకటనలు
ABN , First Publish Date - 2021-06-27T00:26:18+05:30 IST
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ)ఆధ్యర్యంలో కోకాపేట్ లే
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)ఆధ్యర్యంలో కోకాపేట్ లే అవుట్లో భూముల ఈ – ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దీనిని సాకుగా చూపి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ‘సీఎన్ఎన్ వెంచర్స్’ అనే సంస్థపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు ఎఫ్ఐఆర్(104/2021) నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్టీసీ లిమిటెడ్ ద్వారా జరుగుతున్న కోకాపేట్ భూముల ఈ–ఆక్షన్ ప్రక్రియ పూర్తికాకముందే ప్రజలను మభ్యపెట్టేవిధంగా సదరు సీఎన్ఎన్ వెంచర్స్ కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది.
అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి వంచనకు గురిచేస్తున్న తీరును హెచ్ఎండిఏ తీవ్రంగా పరిగణించింది. కోకాపేట్ భూములను మార్కెట్ విలువలో యాబై శాతం(50%) పెట్టుబడులతో 1,500 చదరపు అడుగుల వరకు 3బీహెచ్కె ఫ్లాట్లను సొంతం చేసుకోవచ్చని సీఎన్ఎన్ వెంచర్స్ ప్రకటనల ద్వారా అమాయక ప్రజలను వంచనకు గురిచేస్తున్నది.
ఒకవైపు కోకాపేట్ భూముల ఈ–ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతుండగానే, తక్కువ ధరలకు/రేట్లకు పెట్టుబడులు పెట్టి 3బీహెచ్కె ఫ్లాట్లను కొనుగోలు చేసుకోవచ్చని సామాన్య ప్రజానీకాన్ని ప్రభావితం చేసే విధంగా సీఎన్ఎన్ వ్యవహరించింది. ప్రజల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న సీఎన్ఎన్ వెంచర్స్పై చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ సెక్రెటరీ, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) ప్రాజెక్టు డైరెక్టర్ సంతోష్ ఐఏఎస్ శుక్రవారం నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
హెచ్ఎండీఏ భూముల వేలం పూర్తికాకముందే నిర్ణిష్టమైన అనుమతులు లేకుండానే అమాయక ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్న సీఎన్ఎన్ వెంచర్స్ పై కఠిన చర్యలు తీసుకుని హెచ్ఎండీఏ ప్రతిష్టతను కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాపార ప్రకటనలను, లావాదేవీలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు విశ్వసించరాదని హెచ్ఎండీఏ సూచించింది.