చెత్త రికార్డ్లో చేరిన పృథ్వీ షా.. తొలి బంతికే..!
ABN , First Publish Date - 2021-07-26T06:26:27+05:30 IST
టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా.. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో దారుణంగా విఫలమయ్యాడు. ఏకంగా మ్యాచ్ తొలి బంతికే గోల్డెన్ డక్గా వెనుతిరిగి టీమిండియా..
కొలంబో: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా.. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో దారుణంగా విఫలమయ్యాడు. ఏకంగా మ్యాచ్ తొలి బంతికే గోల్డెన్ డక్గా వెనుతిరిగి టీమిండియా ఫ్యాన్స్ను షాక్కు గురిచేశాడు. దీంతో ఆరంగ్రేట్ర మ్యాచ్లోనే గోల్డెన్ డక్ అయిన రెండో భారత ఆటగాడిగా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఆదివారం శ్రీలంక-ఇండియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. వన్డే సిరీస్ నెగ్గిన ఆత్మవిశ్వాసంతో భారత్ బరిలోకి దిగింది. ఇక ఇప్పటికే ఇంగ్లండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్కు ఎంపికైన పృథ్వీ షాపై అందరి కళ్లూ ఉన్నాయి.
వన్డే సిరీస్లో బాగా రాణించడంతో టీ20లో ఇంకెలా చెలరేగిపోతాడా అని అంతా అనుకున్నారు. అయితే అందరి ఆలోచనను తలకిందులు చేస్తూ పృథ్వీ షా తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. శ్రీలంక పేసర్ చమీరా వేసిన ఇన్నింగ్స్ తొలి బంతిని డిఫెండ్ చేయబోయాడు. కానీ బంతి బ్యాట్ అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని కీపర్ భానుక చేతుల్లోకి వెళ్లింది. దీంతో తొలి బంతికే తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు.
కాగా.. ఇంతకు ముందు కేఎల్ రాహుల్ ఆరంగ్రేట్రం టీ20 మ్యాచ్లో ఇలానే గోల్డెన్ డక్ అయ్యాడు. 2016లో జింబావ్వేపై కెఎల్ రాహుల్ గోల్డెన్ డక్ కాగా, రెండో భారత ఆటగాడిగా పృథ్వీ షా తన పేరు నమోదు చేసుకున్నాడు. అయితే వన్డే సిరీస్లో మాత్రం పృథ్వీ షా పర్వాలేదనిపించాడు. తొలి వన్డేలో 43, రెండో వన్డేలో 13, మూడో వన్డేలో 49 పరుగుల రాణించాడు.