చనిపోయిన ఖైదీని ఆస్పత్రికి తరలించారు.. పోస్ట్మార్టమ్ చేయబోతుండగా డాక్టర్లకు షాక్!
ABN , First Publish Date - 2022-02-05T20:55:50+05:30 IST
జైలులో శిక్ష అనుభవిస్తున్న అతను అనారోగ్యానికి గురయ్యాడు.. హాస్పిటల్కు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు అతడు చనిపోయాడని నిర్ధారించారు..
జైలులో శిక్ష అనుభవిస్తున్న అతను అనారోగ్యానికి గురయ్యాడు.. హాస్పిటల్కు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు అతడు చనిపోయాడని నిర్ధారించారు.. దీంతో పోలీసులు అతని కుటుంబానికి సమాచారం అందించారు.. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు.. వైద్యులు మార్కింగ్ చేసి పోస్ట్మార్టమ్ ప్రారంభింస్తుండగా ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు.. దీంతో వైద్యులు షాకయ్యారు.
స్పెయిన్లో విల్లాబోనాలోని అస్టురియాస్ సెంట్రల్ జైలులో ఉంటున్న మోంటోయా జిమెనెజ్ అనే ఖైదీ ఇటీవల అనారోగ్యానికి గురై స్పృహ కోల్పోయాడు. దీంతో జైలు అధికారులు అతడిని హాస్పిటల్కు తరలించారు. అప్పటికే అతని శరీరం రంగు నీలంలోకి మారిపోయింది. అతడిని పరీక్షించిన ఆన్-డ్యూటీ వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు. దీంతో జైలు అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
జిమెనెజ్ మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. పోస్ట్మార్టమ్ నిర్వహించే ముందు అతని శరీరంపై వైద్యులు మార్కింగ్ కూడా చేశారు. ఆ తర్వాత జిమెనెజ్ వింతగా అరుస్తూ లేచి కూర్చున్నాడు. దీంతో వైద్యులు షాకయ్యారు. అతడిని వెంటనే ఐసీయూలోకి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. ముందు అతడిని పరీక్షించిన వైద్యులపై విచారణకు ఆదేశించారు.