స్పౌజ్‌ కేసులకు ప్రాధాన్యంతో.. నాన్‌ స్పౌజ్‌ టీచర్లకు నష్టం

ABN , First Publish Date - 2022-01-25T07:46:27+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీల్లో స్పౌజ్‌ (ఉద్యోగ దంపతుల) కేసుల కారణంగా నాన్‌ స్పౌజ్‌ టీచర్లకు

స్పౌజ్‌ కేసులకు ప్రాధాన్యంతో.. నాన్‌ స్పౌజ్‌ టీచర్లకు నష్టం

  • పట్టణ ప్రాంతాలనే కోరుకుంటున్న స్పౌజ్‌లు
  • ముందుగా నాన్‌స్పౌజ్‌ వారికే ప్రాధాన్యమివ్వాలి
  • నాన్‌ స్పౌజ్‌ టీచర్స్‌ యూనియన్‌ డిమాండ్‌
  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖ


హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీల్లో స్పౌజ్‌ (ఉద్యోగ దంపతుల) కేసుల కారణంగా నాన్‌ స్పౌజ్‌ టీచర్లకు తీవ్ర నష్టం జరుగుతోందని తెలంగాణ స్టేట్‌ నాన్‌ స్పౌజ్‌ టీచర్స్‌ యూనియన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత బదిలీల్లో స్పౌజ్‌ కేటగిరిలో భాగంగా భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో పనిచేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినా.. వారు పట్టణాలను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లడంలేదని, ఇలాంటి వారు స్పౌజ్‌ అవకాశాన్ని కూడా వదులుకుంటున్నారని పేర్కొంది. స్పౌజ్‌లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే వారు పట్టణ ప్రాంతాలను కోరుకుంటున్నారని, చివరగా మిగిలిన ప్రాంతాలనే నాన్‌ స్పౌజ్‌ వర్కింగ్‌ టీచర్లు ఎంచుకోవాల్సి వస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపింది.


ఇలా జరగకుండా ఉండాలంటే నాన్‌ స్పౌజ్‌ టీచర్లకే బదిలీల్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే స్పౌజ్‌ వారిని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఈ మేరకు యూనియన్‌ అధ్యక్షుడు పోకల శేఖర్‌, ప్రధాన కార్యదర్శి సక్కుబాయి సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖ రాశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 82 మంది స్పౌజ్‌లకు ఉన్నతాధికారులు ఫోన్‌ చేసి అవకాశం కల్పిస్తే.. ఒక్కరు మాత్రమే కేటాయించిన ప్రాంతానికి వెళ్లారని గుర్తు చేశారు.


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మూడు జిల్లాల వారిని సీనియారిటీ ప్రకారం మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు కేటాయించారని, కానీ.. వికారాబాద్‌కు బదిలీ అయినవారు అక్కడికి వెళ్లడానికి ఇష్టపడడం లేదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సివస్తే భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేయడానికే ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ముందుగా నాన్‌స్పౌజ్‌ వారికి పోస్టింగ్‌ ఇవ్వాలని కోరారు. దీంతోపాటు భార్యాభర్తలు (స్పౌజ్‌)ఒకే ఇంట్లో ఉంటారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని వారిద్దరిలో ఒకరికి మాత్రమే హెచ్‌ఆర్‌ఏ వర్తింప చేయాలన్నారు. పైగా జిల్లాల పరిధి చిన్నదిగా మారినందున స్పౌజ్‌లకు ఇచ్చే 10పాయింట్లను తొలగించాలని కోరారు.


Updated Date - 2022-01-25T07:46:27+05:30 IST