జెండా పట్టిన కార్యకర్తలకే పెద్దపీట

ABN , First Publish Date - 2022-06-29T07:36:50+05:30 IST

‘జెండా పట్టిన ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుంది. జిల్లా అధ్యక్షుడిగా అది నా బాధ్యత’ అని వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రకటించారు.

జెండా పట్టిన కార్యకర్తలకే పెద్దపీట

 వైసీపీ జిల్లా ప్లీనరీలో అధ్యక్షుడు చెవిరెడ్డి

తిరుపతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : ‘జెండా పట్టిన ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుంది. జిల్లా అధ్యక్షుడిగా అది నా బాధ్యత’ అని వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రకటించారు.ఆయన అధ్యక్షతన పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశం మంగళవారం తిరుపతిలోని ఎస్వీయూ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల కష్టాలు ఎలా ఉంటాయో, అక్కడ నుంచి వచ్చిన తనకు బాగా తెలుసున్నారు. కుల, మత, వర్గం తేడా లేకుండా అందరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తాను ప్రచారానికి వెళ్లినప్పుడు కొన్ని పల్లెల్లో రోడ్లు లేవని నిరసనలు వచ్చినా, ఓటు మాత్రం వైసీపీకే వచ్చిందన్నారు.  చేసిన పనులకు బిల్లులు అందడంలేదని పలువురు అసంతృప్తి చెందారని, అవికూడా కొన్నిరోజుల్లో సర్దుకుంటాయన్నారు.ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ  వైసీపీ పనైపోయిందనుకుంటున్న వారికి ఈ ప్లీనరీ హెచ్చరికగా నిలుస్తుందన్నారు.ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి , కిలివేటి సంజీవయ్య,వరప్రసాద్‌, బియ్యపు మధుసూదన రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్లీనరీయే ఈస్థాయిలో వుంటే రాష్ట్ర ప్లీనరీ ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. జగన్మోహన్‌ రెడ్డిని మళ్లీ సీఎం చేసేవరకు విశ్రమించేదే లేదన్నారు.ప్లీనరీ ప్రారంభానికి ముందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పరిశీలించి వెళ్లారు. తిరుపతి మేయరు శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, భూమన అభినయ రెడ్డి, కార్పొరేటర్లు, జిల్లా ముఖ్య నాయకులు ,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-29T07:36:50+05:30 IST