ప్రింటింగ్‌ పరిశ్రమను కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2021-02-25T06:50:34+05:30 IST

ప్రింటింగ్‌, న్యూస్‌ పేపర్‌ పరిశ్రమలు సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయని, వాటిని కాపాడుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు.

ప్రింటింగ్‌ పరిశ్రమను కాపాడుకోవాలి

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

పంజాగుట్ట, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రింటింగ్‌, న్యూస్‌ పేపర్‌ పరిశ్రమలు సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయని, వాటిని కాపాడుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ముద్రాపకుల దినోత్సవం సందర్భంగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రింటర్స్‌ వెల్ఫేర్‌ సొసైటీని కోటి రూపాయల నిధితో ప్రారంభించి బైలాస్‌ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ముందుగా దివంగత సభ్యుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాను కూడా ప్రింటింగ్‌ రంగానికి చెందినవాడినేనని, ఉమ్మడి రాష్ట్రంలో అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పని చేశానని, తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రింటర్లతో తనకు సన్నిహిత సంబంధాలు, పరిచయాలు ఉన్నాయని మంత్రి అన్నారు. కోటి రూపాయల మూలధనంపై వచ్చే వడ్డీతో ఆపదలో ఉన్న పేద ప్రింటర్లను ఆదుకోవాలనేది మంచి ఉద్దేశమన్నారు. ప్రింటింగ్‌ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, న్యూస్‌ పేపర్‌ పరిశ్రమ కూడా సంక్షోభంలోకి నెట్టబడుతోందన్నారు. సమావేశంలో సొసైటీ గౌరవాధ్యక్షుడు మర్రి రవీంద్రారెడ్డి, అడహాక్‌ కమిటీ అధ్యక్షుడు కోలా రవీంద్రనాథ్‌రెడ్డి, కార్యదర్శి వేణుగోపాల కృష్ణ, మెషినరీ మాన్యుఫ్యాక్చర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దయాకర్‌ రెడ్డి, తెలంగాణ ఆఫ్‌ సెట్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సి. రవీంద్రారెడ్డి, యడ్లపల్లి వేంకటేశ్వరరావు, దాచేపల్లి వినోద్‌, కె. లక్ష్మణ్‌రావుతోపాటు పలువురు ప్రముఖ ప్రింటర్లు పాల్గొన్నారు. వై. సాంబశివరావు సొసైటీకి రూ. 10 లక్షలు విరాళంగా ప్రకటించారని రవీంద్రారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-02-25T06:50:34+05:30 IST