ఆరోగ్య కార్యకర్తల పిల్లలను షాక్లో ముంచెత్తిన ప్రిన్స్ విలియం దంపతులు
ABN , First Publish Date - 2020-04-10T00:38:33+05:30 IST
ప్రాణాంతక కరోనా వైరస్పై పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తల పిల్లలను బ్రిటన్ ప్రిన్స్ విలియం దంపతులు
లండన్: ప్రాణాంతక కరోనా వైరస్పై పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తల పిల్లలను బ్రిటన్ ప్రిన్స్ విలియం దంపతులు ఆశ్చర్యంలో ముంచెత్తారు. వీడియో కాల్ ద్వారా ఓ స్కూల్లోని చిన్నారులకు ఫోన్ చేసి వారి తల్లిదండ్రులు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ పడగ విప్పుతున్న నేపథ్యంలో మూడు వారాల క్రితం స్కూళ్లను మూసివేశారు. అయితే, నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్), ఇతర ముఖ్యమైన సెక్టార్లలో పనిచేస్తున్న వారి పిల్లల బాగోగులను చూసుకునేందుకు మాత్రం కొన్ని స్కూళ్లను తెరిచి ఉంచారు.
ఈ సందర్భంగా వారికి వీడియో కాల్ చేసిన ప్రిన్స్ విలియం, కేట్ దంపతులు ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి తాను వేస్తున్న పెయింటింగ్ను విలియం దంపతులకు చూపించాడు. ఎన్హెచ్ఎస్లో ఉన్న తన తల్లి ఫొటోను గీస్తున్నట్టు చెప్పాడు. విలియం దంపతులు మాట్లాడుతూ.. మీ తల్లిదండ్రులు చేస్తున్న పనికి మీరంతా గర్వపడాలని, వారో గొప్ప పనిలో ఉన్నారని ప్రశంసించారు. అలాగే, చిన్నారులను చూసుకుంటున్న స్కూలు టీచర్లు, సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. టీచర్లు, పిల్లలతో మాట్లాడి వారిలో ఉత్తేజం కలిగించిన విలియం దంపతులకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.