‘ఎ బ్రిలియంట్ ఫిఫ్టీ’.. రైనాపై మోదీ ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2020-03-29T02:32:27+05:30 IST

టీమిండియా బ్యాట్స్‌మన్ సురేశ్ రైనాపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు.

‘ఎ బ్రిలియంట్ ఫిఫ్టీ’.. రైనాపై మోదీ ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ: టీమిండియా బ్యాట్స్‌మన్ సురేశ్ రైనాపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతు ప్రకటించిన రైనా.. తనవంతు సాయంగా రూ. 52 లక్షలు ప్రకటించాడు. ఇందులో రూ. 31 లక్షలు ‘పీఎం కేర్స్ ఫండ్‌’కు, మిగతా రూ. 21 లక్షలు ‘యూపీ సీఎం డిజాస్టర్ రిలీఫ్ ఫండ్‌’ కు ఇస్తున్నట్టు పేర్కొన్నాడు. అందరూ తమ శక్తిమేర ఎంతో కొంత సాయం చేయాలంటూ ట్విట్టర్ ద్వారా కోరాడు. రైనా ట్వీట్‌కు ప్రధాని మోదీ స్పందించారు. ‘బ్రిలియంట్ ఫిఫ్టీ’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. 


ఎన్డీటీవీ స్టే హోం క్యాంపెయిన్‌లో ఇటీవల పాల్గొన్న రైనా చేతిలో ఓ పోస్టర్ పట్టుకుని కనిపించాడు. అందులో.. ‘నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తాను. మరి మీరు? వారిని (కుటుంబాన్ని) కాపాడుకునేందుకు ఇంట్లోనే ఉంటాను. మరి మీరు?’’ అని అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు.  


ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడైన రైనా.. ఈ నెల మొదట్లో ధోనీ, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా తదితరులతో కలిసి ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్నాడు. అయితే, కోవిడ్-19 కారణంగా ఆ తర్వాత క్యాంపును నిలిపివేశారు. దీంతో క్రికెటర్లందరూ ఇంటికే పరిమితమయ్యారు.

Updated Date - 2020-03-29T02:32:27+05:30 IST