క్యా బండీ..! హాలత్ కైసా హై?
ABN , First Publish Date - 2021-08-06T08:55:17+05:30 IST
: ‘క్యా బండీ..! హాలత్ కైసా హై..?’ అంటూ ప్రధాని మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను ఆత్మీయంగా పలకరించారు.
సంజయ్కి ప్రధాని మోదీ ఆత్మీయ పలకరింపు
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ‘క్యా బండీ..! హాలత్ కైసా హై..?’ అంటూ ప్రధాని మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను ఆత్మీయంగా పలకరించారు. ‘సబ్ ఠీక్ హో జాయేగా..’ అంటూ వెన్ను తట్టారు. ప్రధాని మోదీని గురువారం పార్లమెంటులోని ఆయన చాంబర్లో ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఓబీసీ కమిటీ చైర్మన్ సంజయ్ను పరిచయం చేయబోగా ‘బండి.. మాలూమ్ హైనా..!’ అని చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. సుమారు పావు గంట పాటు కొనసాగిన ఈ సమావేశం సందర్భంగా సంజయ్తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని.. తెలంగాణ రాజకీయాలపై ఆరా తీశారు. ‘అచ్ఛా కామ్ కర్ రహే.. కీపిట్ అప్.. గో ఎహెడ్..’ అని భుజం తట్టారు.
కాగా,వైద్య విద్య కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్ కల్పించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధానికి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అనంతపురం గ్రామం నుంచి తిమ్మాపూర్ వరకు కొత్త సర్వీసు రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సంజయ్ గురువారం లేఖ రాశారు. కరీంనగర్ జిల్లాలోని కోట్ల నర్సింహులపల్లె గ్రామంలో పురాతన శ్రీ లక్ష్మీనర్సింహ, అన్నపూర్ణ విశ్వనాథ ఆలయాలను సంరక్షించాలని కోరుతూ పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డికి సంజయ్ మరో లేఖ రాశారు.
16 నుంచి కేంద్ర మంత్రుల ఆశీర్వాద యాత్ర: లక్ష్మణ్
ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు ఆశీర్వాద యాత్రలు నిర్వహిస్తారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఢిల్లీలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఈ యాత్ర చేపడతారన్నారు. ఈ నెల 11న ఓబీసీకి చెందిన కేంద్ర మంత్రులను సన్మానిస్తామని చెప్పారు. ఓబీసీ విధానాలపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులతో చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.