-
-
Home » Andhra Pradesh » Kurnool » Price palpitations-MRGS-AndhraPradesh
-
ధరల దడ
ABN , First Publish Date - 2022-05-10T05:28:06+05:30 IST
నిత్యావసరాల ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. పేద, మధ్య త తరగతి ప్రజలకు పెను భారంగా మారాయి.
- పెరిగిన ధరలతో ఇంటి బడ్జెట్ తడిసి మోపెడు
- ఆదాయం లేని సమయంలో అధిక భారం
- కొరత పేరుతో ధరలు పెంచి విక్రయం
- షాక్ కొడుతున్న కరెంట్ చార్జీలు
- భారంగా సిలిండర్ బండ
- భయపెడుతున్న పెట్రోల్ ధరలు
- మండుతున్న వంట నూనె
- సామాన్యులు విలవిల
వైసీపీ పాలనలో సామాన్యులకు బతుకు భారమైంది. కిరాణం సరుకుల నుంచి గ్యాస్, విద్యుత, పెట్రోల్ ఇలా అన్ని ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రతి నెలా బడ్జెట్ వ్యయం పెరిగిపోతుండడంతో ఏమి తినాలో.. ఎలా బతకాలో తెలియని పరిస్థితిలో పేద, మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. ‘మేం అధికారంలోకి వస్తే పేదల బతుకులు మారుతాయి. ధరలకు కళ్లెం వేస్తాం. సామాన్య ప్రజల తలరాతలు మారుస్తాం’ అని ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా.. ప్రస్తుత సీఎం జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడేమో ఇందుకు విరుద్ధంగా పాలన సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ మూడేళ్ల పాలనలో నిత్యం ఏదో ఒక వస్తువు ధర పెరుగుతూనే ఉంది. దీనికితోడు ఉపాధి మార్గాలు లేకపోవడంతో పేదల బతుకులు తలకిందులయ్యాయి.
ఆదోని(అగ్రికల్చర్)/కర్నూలు (కలెక్టరేట్)/ నంద్యాల (నూనెపల్లె), మే 9: నిత్యావసరాల ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. పేద, మధ్య త తరగతి ప్రజలకు పెను భారంగా మారాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరగడంతో జనాలకు నిత్యావసర ధరలు సైతం చుక్కలు చూపిస్తున్నాయి. అసలే ఆదాయం లేక సామాన్యులు, మధ్య తరగతి వారు ఇబ్బంది పడుతుంటే పెరుగుతున్న ధరలు మరింత భయపెడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణ భారం పెరిగిందని వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. రోజు వారిగా వినియోగించే నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. అధికారులు తనిఖీలు చేపట్టిన రోజు మాత్రం మామూలు ధరకు విక్రయించి మిగిలిన రోజుల్లో ధర పెంచి అమ్ముతున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి రవాణ..
జిల్లాలో ప్రజలకు అవసరమైన నిత్యావసరల్లో చాలా వరు ఉత్తర దక్షిణ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరుకులు తీసుకోవాలంటే తీసుకు రావడానికి లారీలు రవాణా చార్జీలు భారీగా పెంచేశారని టోకు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఉప్పు దగ్గర్నుంచి బియ్యం, కంది బేడలు, వంట నూనె వరకు పెరిగిన ధరలతో అవస్థలు పడుతున్నారు. కేజీ ఉప్పు ధర రూ.20 నుంచి రూ.25 అమ్ముతున్నారు. వంట నూనె ధర లీటరు రూ.150 నుంచి 198 విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి వస్తువుపై 30 శాతం నుంచి రెట్టింపు ధర పలుకుతున్నాయి. సామాన్యులు కొని తినలేని పరిస్థితి.
పెరుగుదల ఇలా..
పొద్దుతిరుగుడు, నూనె గత ఏడాది ఏప్రిల్ రూ.95 ఉండేది ప్రస్తుతం రూ.198, చింతపండు రూ.135 నుంచి రూ.160, పెసరపప్పు రూ.84 నుంచి రూ.120, ఎండు మిర్చి రూ.140 నుంచి రూ.260, బెల్లం రూ.47 నుంచి రూ.60, ఉప్పు రూ.20 నుంచి రూ.25, జొన్నలు రూ.30 నుంచి రూ.45, సెనగపప్పు రూ.65 నుంచి రూ.80, మినపప్పు రూ.75 నుంచి రూ.120కి పెరిగింది.
కృత్రిమ కొరత సృష్టించి..
కొందరు వ్యాపారులు ప్రత్యేకంగా ఒక్కో సరుకును భారీ స్థాయిలో తెచ్చి అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. ఇటీవల ఉక్రెయిన రష్యా దేశాల మధ్య జరిగిన యుద్ధంతో వంట నూనె ధరలు, కందిబేడలు ధరలు భారీగా పెరిగాయి. దిగుమతి లేదని నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టించారు. ఆయిల్ కంపెనీలు సైతం అదే బాట పట్టి సొమ్ము చేసుకున్నాయి.
నిర్మాణ రంగం కుదేలు
వైసీపీ పాలనలో నిర్మాణ రంగానికి సంబంధించిన వాటి ధరలు విపరీతంగా పెరిగి ఆ రంగం కుదేలైంది. భవన నిర్మాణ పనులు లేక కార్మికులకు ఉపాధి కరువైంది. మూడేళ్ల కిందట ట్రాక్టర్ ఇసుక రూ.2,300 ఉండేది. ఇప్పుడు రూ.5 వేల నుంచి రూ.6 వేలు వెచ్చించాల్సి వస్తోంది. సిమెంట్ ధరలు గ్రేడ్ల వారీగా పోల్చితే ఒక్కో బస్తాపై సుమారు రూ.100 పెరిగింది. ఇనుము టన్ను రూ.50 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.90 వేలకు చేరింది. ఓవైపు కొవిడ్ వ్యాప్తితో క్షీణించిన నిర్మాణ రంగంపై...మరోవైపు అడ్డూ అదుపు లేకుండా ధరల భారం పడడంతో మరింత కుదేలైంది.
పండుగ కానుకల్లేవ్
నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు పండుగ కానుకలు కూడా అందడం లేదు. గత ప్రభుత్వం సంక్రాంతి, రంజాన, క్రిస్మస్ పండుగల సమయంలో ప్రత్యేకంగా కానుకలు అందజేసింది. సుమారు 9 రకాల సరుకులను ప్యాకేజీగా ఇచ్చేది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఈ కానుక లేవీ అందజేయడం లేదు. రేషన కార్డుదారులకు ప్రతినెలా బియ్యం తప్ప.. పంచదార, కందిపప్పు కూడా సక్రమంగా అందించడం లేదు.
ఇతని పేరు కాశీం. ఓ ప్రైవేటు ఉద్యోగి. నెల జీతం రూ.20 వేలు. ఇంట్లో నలుగురు ఉన్నారు. వీళ్లకు మూడేళ్ల కింద నిత్యావసరాలకు నెలకు రూ.7 వేల ఖర్చు వచ్చేది. మిగిలిన దానిలో ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, వైద్యం మొదలైన ఖర్చులకు సరిపెట్టుకునేవారు. ఇంక ఏమీ మిగిలేది కాదు. ఇప్పుడు కాశీం బడ్జెట్ తలకిందులైంది. ఈ మూడేళ్లలో జీతం పెరిగిందేమీ లేదు. కానీ ఖర్చులు భారీగా పెరిగాయి. పెరిగిన ధరలతో నిత్యావసరాల వ్యయం ఇప్పుడు రూ.12 వేలు. ఇది కాశీం ఒక్కడి పరిస్థితే కాదు. రాష్ట్రంలోని సగటు మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఇలాగే ఉంది.
కొందరు వ్యాపారులు ప్రత్యేకంగా ఒక్కో సరుకును భారీ స్థాయిలో తెచ్చి అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. ఇటీవల ఉక్రెయిన రష్యా దేశాల మధ్య జరిగిన యుద్ధంతో వంట నూనె ధరలు, కందిబేడలు ధరలు భారీగా పెరిగాయి. దిగుమతి లేదని నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టించారు. ఆయిల్ కంపెనీలు సైతం అదే బాట పట్టి సొమ్ము చేసుకున్నాయి.
2019 మే నాటికి ఉన్న రేట్ల వివరాలు(సుమారు)
--------------------------------------------------------------------
నిత్యావసరాలు 2019 నాటి రేట్లు ప్రస్తుత రేట్లు
-----------------------------------------------------------------
సన ఫ్లవర్ ఆయిల్ రూ.90 రూ.198
పామోలిన ఆయిల్ రూ.76 రూ.121
పాలు రూ.40 రూ.70
కందిపప్పు రూ.50 రూ.100
వంటగ్యాస్ రూ.650 రూ.1050
ఇనుము(టన్ను) రూ.50 వేలు రూ.90 వేలు
ఇసుక రూ.2300 రూ.6000
పెట్రోలు రూ.80 రూ.120
కరెంటు బిల్లు రూ.300 రూ.700
-------------------------------------------------------------------
ఆదాయం కంటే ఖర్చు పెరిగింది
ఆదాయం అంతంత మాత్రమే ఉంది. పెరిగిన నిత్యావసర ధరలు వల్ల ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఏ వస్తువు ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉన్నాయి. ప్రశ్నిస్తే డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెరిగాయని రవాణా ఖర్చులు భారీగా చెల్లించి తెస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు ఉప్పు, కారం, పప్పుదినుసుల ధరలు, ఆయిల్ ధరలు 50 శాతం పైగా ధరలు పెరిగాయి. నిత్యావసర ధరలు పెరిగినా కొనక తప్పదు.
-వీరచంద్రయాదవ్, ఆదోని
సామాన్యుల జీవనం అస్తవ్యస్తం
సామాన్యుల జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. తినే తిండి గింజ నుంచి ప్రజలకు అవసరమయ్యే ప్రతి వస్తువు ధర విపరీతంగా పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జగన ఒక్క అవకాశం అంటూ చివరకు ప్రజలను నట్టేట ముంచారు.
- వెంకటేశ్వర్లు, నంద్యాల