శుభవార్త: తగ్గనున్న డయాబెటిక్ ఔషధాల ధర
ABN , First Publish Date - 2022-07-12T18:32:40+05:30 IST
మధుమేహ రోగులకు శుభవార్త. టైప్-2 డయాబెటిక్ రోగులు ఉపయోగించే సిటాగ్లిప్టిన్ టాబ్లెట్ల ధర భారీగా తగ్గనుంది. ప్రస్తుతం ఈ టాబ్లెట్ల కోసం డయాబెటిక్ బాధితులు రోజుకు
న్యూఢిల్లీ, జూలై 11: మధుమేహ రోగులకు శుభవార్త. టైప్-2 డయాబెటిక్ రోగులు ఉపయోగించే సిటాగ్లిప్టిన్ టాబ్లెట్ల ధర భారీగా తగ్గనుంది. ప్రస్తుతం ఈ టాబ్లెట్ల కోసం డయాబెటిక్ బాధితులు రోజుకు రూ.45 వరకు ఖర్చు చేస్తున్నారు. త్వరలో ఇది రూ.8 నుంచి రూ.15 మించకపోవచ్చు. అంటే ధర దాదాపు 70% వరకు తగ్గవచ్చు. దీంతో దేశంలోని దాదాపు ఏడున్నర కోట్ల మంది మధుమేహ బాధితులకు పెద్ద ఉపశమనం లభించనుంది. సిటాగ్లిప్టిన్ పేటెంట్ ఔషధం. అమెరికా ఫార్మా దిగ్గజం మెర్క్కు ఈ ఔషధంపై పేటెంట్ ఉంది. జనువియా పేరుతో మెర్క్ కంపెనీ ఈ ఔషధాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తోంది. సిటాగ్లిప్టిన్పై మెర్క్కున్న పేటెంట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కాగా మెర్క్ భారత్లో ఎంఎ్సడీ పేరుతో కార్యకలాపాలు సాగిస్తోంది. సన్ ఫార్మా మాత్రమే ఎంఎస్డీ నుంచి లైసెన్స్ పొంది ఈ ఔషధాలను విక్రయిస్తోంది. కాగా గ్లెన్మార్క్ కంపెనీ ఇప్పటికే సిటాజిట్ పేరుతో 50, 100 ఎంజీ డోసేజిలో తన జెనరిక్ సిటాగ్లిప్టిన్ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. జనువియాతో పోలిస్తే దీని ధర మూడో వంతు మాత్రమే ఉంది. ఇక సిటాగ్లిప్టిన్ పేటెంట్ గడువు ముగుస్తుండటంతో సిప్లా, డాక్టర్ రెడ్డీస్తో సహా మరో 40 కంపెనీలు త్వరలో తమ జెనరిక్ సిటాగ్లిప్టిన్ టాబ్లెట్లను మార్కెట్లో విడుదల చేయబోతున్నాయి. దీంతో ధరలు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు.