బీఆర్ఎస్కు పరీక్షగా మునుగోడు ఉపఎన్నిక..
ABN , First Publish Date - 2022-10-06T17:43:18+05:30 IST
బీఆర్ఎస్కు మునుగోడు ఉపఎన్నిక పరీక్షగా మారింది. రేపటి నుంచి 14 వరకు మునుగోడు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగనుంది.
నల్లగొండ : బీఆర్ఎస్కు మునుగోడు ఉపఎన్నిక పరీక్షగా మారింది. రేపటి నుంచి 14 వరకు మునుగోడు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. ఈ లోగా అభ్యర్థి ప్రకటన, నామినేషన్ దాఖలుపై ఆలోచన ధోరణిలో గులాబీ బాస్ ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారా... లేక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికలకు పోతారా అన్న సందిగ్ధంలో క్యాడర్ ఉంది. తెలంగాణ సెంటిమెంట్ పదం లేకుండా... బీఆర్ఎస్ పేరుతో నామినేషన్ వేస్తే ఎలా అన్న సందిగ్ధంలో క్యాడర్ ఉంది.
టీఆర్ఎస్ పేరుతోనే నామినేషన్ వేసే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు.
మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహం అమలు చేస్తోంది. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించింది. ప్రతి యూనిట్కు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించింది. 14 మంది మంత్రులు, ముగ్గురు ఎంపీలు, 54 మంది ఎమ్మెల్యేలను ఇన్చార్జులుగా నియమించింది.
ఏడుగురు ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. ప్రతి ఎంపీటీసీ పరిధికి ఒక ఎమ్మెల్యే, మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ఒక్కో ఎమ్మెల్యేకు 800 నుంచి 1200 మంది ఓటర్లున్నారు. మంత్రులకు అత్యధికంగా 3 వేల ఓటర్ల బాధ్యతలు అప్పగించారు. ప్రచారం చివరిరోజు వరకూ నియోజకవర్గంలోనే ఉండాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.