సీబీఐ కోర్టు విచారణను అడ్డుకోండి
ABN , First Publish Date - 2022-01-25T07:13:23+05:30 IST
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) అక్రమ మైనింగ్ కేసులో
- హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ శ్రీలక్ష్మి
హైదరాబాద్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) అక్రమ మైనింగ్ కేసులో దిగువ కోర్టు(సీబీఐ కోర్టు) విచారణను అడ్డుకోవాలని కోరుతూ ఐఏఎస్ అధికారి వై. శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఓఎంసీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ 2015లో ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో వాదనలు ముగియడంతో ఇటీవల హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. హైకోర్టు కేసులో తీర్పు వెలువడే వరకు దిగువ కోర్టులో ఉన్న తన డిశ్చార్జి పిటిషన్పై విచారణ వాయిదా వేయాలని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది రాఘవాచార్యులు సోమవారం హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. హైకోర్టులో తీర్పు రిజర్వు అయిన విషయాన్ని చెప్పి.. విచారణ వాయిదా వేయాలని దిగువ కోర్టులో అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ మేరకు డిశ్చార్జి పిటిషన్పై విచారణను వాయిదా వేయాలని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాదులు దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా వాయిదా పిటిషన్ను దిగువ కోర్టు కొట్టేసింది. దిగువ కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీలక్ష్మి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కేసులో తీర్పు రాకముందు డిశ్చార్జి పిటిషన్పై దిగువ కోర్టు ఏదైనా తీర్పు ఇస్తే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని పిటిషనర్ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దిగువ కోర్టు విచారణను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.