‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి’

ABN , First Publish Date - 2021-02-27T20:26:08+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ పేర్కొన్నారు.

‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి’

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం  తగిన విధంగా స్పందించకపోతే ‘జై ఆంధ్ర ఉద్యమం’ మళ్లీ పురుడు పోసుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ శనివారం.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలకు రామ్ స్వయంగా వినతిపత్రాలను అందజేశారు. ఆ వినతి పత్రాలలో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా  గండిగుండం గ్రామంలో ఓటర్లను సజీవ సమాధి చేస్తామని, వైసీపీకి చెందిన నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు  విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి  శ్రీనివాసరావు, గండిగుండంలో స్థానిక నాయకుడు శ్రీనివాసరావు ఓటర్లను బెదిరించిన వారిలో ఉన్నారని పేర్కొన్నారు. 


ప్రతిపక్ష నేత చంద్రబాబుని సైతం చంపుతామని వైసీపీ నాయకులు నేరుగా బెదిరిస్తున్నారని, మరోవైపు తనకు కూడా చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అందరి ఆమోదంతో అమరావతి రాజధానిగా ఆవిర్భవించిందన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో అమరావతి ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతుని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ 438 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని రామ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 120 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేయాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తోందన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తక్షణమే.. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని రామ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-02-27T20:26:08+05:30 IST