రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధనలో నడ్డా, రాజ్నాథ్
ABN , First Publish Date - 2022-06-13T01:00:47+05:30 IST
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకోసం అధికార, విపక్ష పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకోసం అధికార, విపక్ష పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. యుపిఏ, యుపిఏ యేతర పక్షాలతో చర్చలు జరిపే బాధ్యతను భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ కు ఎన్డీఏ అప్పగించింది. జూన్ 15 తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీతో పాటు యూపిఏ అనుకూల పార్టీలు, తటస్థంగా ఉన్న పార్టీల నేతలతో నడ్డా, రాజ్నాథ్ చర్చలు జరుపుతారు.
మరో వైపు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం, భావసారూప్య పార్టీలతో చర్చల కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను ఎంపిక చేశారు. ఆయనకే సమన్వయ బాధ్యతలు కూడా అప్పగించారు.
అటు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం 22 మంది విపక్ష నేతలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ లేఖలు రాశారు. జూన్ 15న ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై మమతా నేతృత్వంలో వీరంతా సమావేశమై చర్చిస్తారు.
ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.