సుప్రీంకోర్టు నూతన జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

ABN , First Publish Date - 2021-08-26T22:36:25+05:30 IST

సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తులను కొత్తగా నియమించేందుకు

సుప్రీంకోర్టు నూతన జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తులను కొత్తగా నియమించేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు. వీరిని నియమిస్తూ ‘వారంట్స్ ఆఫ్ అపాయింట్‌మెంట్’పై సంతకం చేశారు. అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులుగా నియమితులైన తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే, ఈ తొమ్మిది మందిలో ఇద్దరు తెలుగువారు భవిష్యత్తులో భారత దేశ ప్రదాన న్యాయమూర్తులయ్యే అవకాశం ఉంది. తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అనే కీర్తిప్రతిష్ఠలు  తెలుగు మహిళకు లభించే అవకాశం కనిపిస్తోంది. 


తెలుగువారైన జస్టిస్ బీవీ నాగరత్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈమె 2027 సెప్టెంబరులో భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టిస్తారు. మరో తెలుగు తేజం పీఎస్ నరసింహ కూడా  భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. 


సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం 24 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఈ నూతన నియామకాలతో అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుతుంది. ఇక ఒక న్యాయమూర్తి పదవి మాత్రమే ఖాళీగా ఉంటుంది. 


సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన మహిళలు... జస్టిస్ బీవీ నాగరత్న (కర్ణాటక హైకోర్టు), జస్టిస్ బెలా ఎం త్రివేది (గుజరాత్ హైకోర్టు), జస్టిస్ హిమ కొహ్లి (తెలంగాణా హైకోర్టు). అత్యున్నత న్యాయస్థానానికి ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులు నియమితులు కావడం మన దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 


సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొత్తగా నియమితులైన తొమ్మిది మందిలో, సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహ (సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్), జస్టిస్ ఏఎస్ ఓఖా (కర్ణాటక హైకోర్టు), జస్టిస్ విక్రమ్ నాథ్ (గుజరాత్ హైకోర్టు), జస్టిస్ జేకే మహేశ్వరి (సిక్కిం హైకోర్టు), జస్టిస్ సీటీ రవి కుమార్ (కేరళ హైకోర్టు), జస్టిస్ ఎంఎం సుందరేశ్ (మద్రాస్ హైకోర్టు) ఉన్నారు. 


భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం నూతన న్యాయమూర్తుల నియామకం కోసం గత వారం చేసిన సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించారు. 


Updated Date - 2021-08-26T22:36:25+05:30 IST