ఉపాధ్యాయుల చేతుల్లో భావి తరం భవిష్యత్తు భద్రం : రాష్ట్రపతి

ABN , First Publish Date - 2021-09-05T18:22:21+05:30 IST

ఉపాధ్యాయుల చేతుల్లో భావి తరం భవిష్యత్తు భద్రమని రాష్ట్రపతి

ఉపాధ్యాయుల చేతుల్లో భావి తరం భవిష్యత్తు భద్రం : రాష్ట్రపతి

న్యూఢిల్లీ : ఉపాధ్యాయుల చేతుల్లో భావి తరం భవిష్యత్తు భద్రమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాల సందర్భంగా ఆదివారం ఆయన 44 మంది ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. కోవిడ్-19 నిబంధనల మేరకు ఈ కార్యక్రమం వర్చువల్ విధానంలో జరిగింది.


కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్‌సీ మీనా 44 మంది ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రకటించారు. వీరిలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూ-కశ్మీరు, కార్గిల్‌లకు చెందిన ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పురస్కారాలను వీరికి రాష్ట్రపతి వర్చువల్ విధానంలో ప్రదానం చేశారు. 


ఈ సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులందరినీ అభినందించారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల గురించి తెలుసుకున్న తర్వాత, వారి చేతుల్లో భావి తరం భవిష్యత్తు భద్రంగా ఉందనే భరోసా తనకు కలిగిందన్నారు. మాజీ రాష్ట్రపతి, ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గుర్తుగా ఉపాధ్యాయ దినోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. ఆయన ప్రపంచంలో గొప్ప తత్త్వవేత్త, పండితుడు అని తెలిపారు. తాను ఉపాధ్యాయునిగానే అందరి మనసుల్లో గుర్తుండిపోవాలని ఆయన కోరుకునేవారన్నారు. గొప్ప ఉపాధ్యాయునిగా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు.


డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5న జన్మించారు. గొప్ప తత్త్వవేత్తగా ఆయనకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. మన దేశ తొలి ఉప రాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయనను ‘భారత రత్న’తో ప్రభుత్వం గౌరవించింది. 


డాక్టర్ రాధాకృష్ణన్ వద్ద చదువుకున్న కొందరు విద్యార్థులు ఒకసారి ఆయన వద్దకు వెళ్ళి, ఆయన జన్మదినోత్సవాలను జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు ఆయన బదులిస్తూ, తన జన్మదినంనాడు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవాలను నిర్వహిస్తున్నారు.


Updated Date - 2021-09-05T18:22:21+05:30 IST