భద్రతా లోపంపై రాష్ట్రపతి తీవ్ర ఆందోళన

ABN , First Publish Date - 2022-01-06T21:33:45+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌లో బుధవారం పర్యటించిన సమయంలో

భద్రతా లోపంపై రాష్ట్రపతి తీవ్ర ఆందోళన

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌లో బుధవారం పర్యటించిన సమయంలో జరిగిన భద్రతాపరమైన లోపాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రపతి  గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పంజాబ్‌లో బుధవారం జరిగిన భద్రతా లోపాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధాన మంత్రి వాహన శ్రేణి ప్రయాణిస్తున్నపుడు జరిగిన సంఘటనల గురించి తెలుసుకున్నారు. భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 


ఈ సమావేశం అనంతరం మోదీ ట్విటర్ వేదికగా రామ్‌నాథ్ కోవింద్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశాను. (భద్రతా లోపాలపై) ఆందోళన వ్యక్తం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. నా శ్రేయస్సును ఆకాంక్షించినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఇటువంటి ఆకాంక్షలే ఎల్లప్పుడూ బలాన్నిస్తాయి’’ అని మోదీ ట్వీట్ చేశారు. 


ఇదిలావుండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తు చేసేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది. జస్టిస్ (రిటైర్డ్) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం అఫైర్స్) అండ్ జస్టిస్ అనురాగ్ వర్మలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. 


మరోవైపు ఈ సంఘటనపై విచారణ జరపాలంటూ న్యాయవాది మణీందర్ సింగ్ సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరుగుతుంది. 


Updated Date - 2022-01-06T21:33:45+05:30 IST