రిపోర్టర్‌‌పై నోరు పారేసుకున్న బైడెన్.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2022-01-25T17:14:25+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి చెందిన రిపోర్టర్‌పై నోరు పారేసుకున్నారు.

రిపోర్టర్‌‌పై నోరు పారేసుకున్న బైడెన్.. వీడియో వైరల్!

వాషింగ్టన్​: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి చెందిన రిపోర్టర్‌పై నోరు పారేసుకున్నారు. ధరల పెరుగుదల గురించి ఓ విలేకరి ప్రశ్నించగా సహనం కోల్పోయిన బైడెన్ అతనిపై అసభ్య పదజాలాన్ని ప్రయోగించారు. వాషింగ్టన్​లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అధ్యక్షుడు బైడెన్ సోమవారం వాషింగ్టన్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి చెందిన పీటర్ డూసీ అనే రిపోర్టర్ నిత్యావసర ధరల పెరుగుదలపై ప్రశ్నించారు. దీనిలో భాగంగా మధ్యంతర ఎన్నికల​ ఫలితాలపై అధిక ద్రవ్యోల్బణం ప్రభావం పడుతుందా? అని అడిగారు. దీనికి సమాధానం ఇచ్చిన బైడెన్.. 'అధిక ద్రవ్యోల్బణంతో లాభమే. స్టుపిడ్ సన్ ఆఫ్ ఎ **' అంటూ బూతు పురాణం అందుకున్నారు. ఇదంతా మైక్రోఫోన్లు, కెమెరాలో రికార్డైంది. ఆ వీడియో కాస్తా బయటకు రావడంతో వైరల్‌గా మారింది. 


అయితే, రిపోర్టర్​ పీటర్ డూసీకి ఆ తర్వాత అధ్యక్షుడు క్షమాపణ చెప్పినట్లు సమాచారం. అతడ్ని తన కార్యాలయానికి పిలిపించుకుని బైడెన్ క్షమాపణ చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఇక గతవారం కూడా బైడెన్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పీటర్ డూసీతో ఇలాగే దురుసుగా ప్రవర్తించారు. 'నువ్వు నన్ను ఎప్పుడూ మంచి ప్రశ్నలే అడుగుతావు' అని డూసీని ఉద్దేశించి బైడెన్ వ్యంగ్యంగా మాట్లాడారు. దానికి రిపోర్టర్.. 'నా వద్ద చాలా ప్రశ్నలు ఉన్నాయి' అని బదులిచ్చారు. అప్పుడు బైడెన్ బదులుగా.. 'అవును.. నీ దగ్గర చాలా ప్రశ్నలు ఉంటాయని నాకు తెలుసు. కానీ అందులో ఒక్కటి కూడా పనికొచ్చేదని నాకు అనిపించదు' అని అన్నారు. దాంతో నిర్ఘాంతపోవడం డూసీ వంతైంది. ఇదే కోవలో గతవారం రష్యా విషయమై ఓ మహిళా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సైతం అధ్యక్షుడు ఘాటుగా సమాధానం ఇచ్చారు. 'ఉక్రెయిన్ విషయంలో పుతిన్​ తొలి అడుగు వేసేంతవరకు ఎందుకు వేచి చూస్తున్నారు' అని విలేకరి అడిగితే.. 'ఏంటీ చెత్త ప్రశ్న' అని జో బైడెన్ మండిపడ్డారు.



Updated Date - 2022-01-25T17:14:25+05:30 IST