సాగుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2022-06-07T05:30:00+05:30 IST

వేసవి ముగుస్తోంది. అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై వానాకాలం పంటలకు అనువైన వాతావరణం ఏర్పడుతోంది. ఐదారు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కూడా ప్రవేశించే అవకాశం ఉంది.

సాగుకు సన్నద్ధం
తాండూరు మండలం బెల్కటూర్‌లో దున్నుతున్న రైతు

  • వేసవి దుక్కులు చేసుకుంటున్న రైతులు
  • తొలకరి కురియగానే విత్తేందుకు సిద్ధం
  • సాగులో విత్తన ఎంపిక కీలకం
  • నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు, శాస్త్రవేత్తలు

  వేసవి ముగుస్తోంది. అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై వానాకాలం పంటలకు అనువైన వాతావరణం ఏర్పడుతోంది. ఐదారు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కూడా ప్రవేశించే అవకాశం ఉంది. ఇప్పటికే సగం మంది రైతులు వేసవి దుక్కులు చేసుకొని విత్తనాలు విత్తుకునేందుకు సన్నద్ధమయ్యారు. సాగులో విత్తన ఎంపిక అతి ముఖ్యం అని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నకిలీ విత్తనాలతో మోసపోకుండా నాణ్యమైన వాటిని గుర్తింపు పొందిన డీలర్ల వద్దే కొనుగోలు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. కొన్న విత్తనాలకు, ఎరువులకూ బిల్లు తీసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.

పరిగి/తాండూరు రూరల్‌, జూన్‌ 7: వానాకాలం సీజన్‌ వచ్చింది. ఇప్పటికే కొందరు రైతులు వేసవి దుక్కులు చేసుకొని తొలకరి కురియగా విత్తనాలు వేసేందుకు సిద్ధం అయ్యారు. మరి కొందరు సమాయత్త పనులు చేసుకుంటున్నారు. అయితే సాగులో ఏ పంట వేయాలనేది ఒక అంశమైతే ఆ పంట విత్తన ఎంపిక కూడా ప్రధానమైంది. నకిలీ, కల్తీ విత్తనాలు నాటితే ఆరు నెలల రైతుల శ్రమ, పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అదీగాక ఎక్కువ దిగుబడి సాధించాలన్నా మన్నికైన విత్తనం వేయడం తప్పనిసరి. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా మొత్తానికీ అక్రమార్కులను అరికట్టలేకపోవచ్చు. కాబట్టి విత్తన ఎంపికలో ప్రతీ రైతు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన విత్తనాలే వాడాలి. ఈ విషయంలో రైతులు మోసపోకుండా ఉండాలంలే అప్రమత్తత ఒక్కటే మార్గం. విత్తన కంపెనీ చరిత్ర, విత్తన రకం, మొలక శాతం, తయారీ/ఎక్స్‌పైరీ డేట్లు, డీలర్‌ గుర్తింపు తదితర వివరాలన్నీ చూసుకొని విత్తనాలు కొనుగోలు చేయాలి. ప్రభుత్వం సరఫరా చేసే సబ్సిడీ, నాన్‌ సబ్సిడీ విత్తనాలతో రైతులకు నష్టభయం కొంత తగ్గుతుంది. 


  • విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్న రైతులు

వేసవి దుక్కులతో పంటలను ఆశించే కీటకాలు, వాటి గడ్లు అన్నీ చనిపోతాయి. ఎండలకు దుక్కి ఎండిపోయి వానాకాలంలో ఎక్కువ నీటికి ఇంకించుకుంటుంది. జూన్‌ 10 నాటికి రుతుపవనాలొచ్చే అవకాశం ఉంది. ఈ లోగా రైతులు భూమిని చదును చేసుకొని సిద్ధంగా ఉండాలి. ఇదిలా ఉంటే తాండూరు మండలంలో 36వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేస్తారు. పత్తి, కంది, పెసర, మినుము, సోయాబీన్‌ కూరగాయ తదితర పంటలు వేస్తారు. రైతులు వారి వారి క్షేత్రాల్లో భూసార పరీక్షలు చేయించి శాస్రవేత్తలు సూచించిన పంటలు, సూచించిన పరిమాణంలో సేంద్రియ, రసాయన ఎరువు లు వేసుకోవాలి. అలాగే సహజ ఎరువు, భూమిలో హ్యుమ్‌సను వృద్ధి చేసుకునేందుకు ఎకరానికి 20-25కిలోల జీలుగ విత్తనాలు చల్లి అవి మొలకెత్తిన 20రోజుల తరువాత భూమిలో దున్నేయాలి. అది మురి గి పంటలకు సేంద్రియ ఎరువవుతుంది. అనంతరం ప్రధాన పంట వేసుకోవాలి. నల్లరేగడి భూముల్లో దుక్కులకు ఇది అదును అని తాండూరు వ్యవసాయ శాఖాధికారి రుద్రమూర్తి తెలిపారు.


  • విత్తన నాణ్యతను ఇలా పరిశీలించాలి : ప్రభాకర్‌రెడ్డి, ఏవో, పరిగి

రైతు ఏ పంట వేయాలో నిర్ణయించుకున్న తర్వాత నాటే విత్తనాల్లోని వంద గింజలను తీసుకోవాలి. వాటిని తడిగుడ్డలో వేసి ముడి ముడివేయాలి. ఆ విత్తనాలను ఐదురోజుల్లో రెండుసార్లు తడపాలి. ఆరో రోజు గుడ్డను విప్పి వంద గింజల్లో ఎన్ని మొలకలొచ్చాయో చూడా లి. 70 అంతకన్నా ఎక్కువ విత్తులు మొలకొస్తే ఆ విత్తనాలు బాగున్నాయని అర్థం. గింజను బట్టి కూడా విత్తన నాణ్యత ను తెలుసుకోవచ్చు. వట్టిపోయిన, తాలు, బుడ్డిన, లేదా చిన్న గా ఉన్న విత్తనాలను వేసుకోవద్దు. వాటి మొలక శాతం తక్కువ. వాటివల్ల పంట దిగుబడీ పడిపోతుంది. అలాగే కొందరు విత్తన వ్యాపారులు వాహనాల్లో గ్రామాల్లో తిరుగు తూ సీడ్‌ అమ్ముతుంటారు. వారివద్ద కొనొద్దు. వారికి ఏ అడ్ర స్‌ ఉండదు. ఇచ్చే రషీదులు కూడా మోసమే. ప్రచారం చేసే కంపెనీ కూడా వట్టిదే. గుర్తింపు పొందిన విత్తన డీలర్లు, ఫర్టిలైజర్‌ షాపుల్లోనే విత్తనాలు కొని రషీదు పొందాలి. అలాంటి విత్తనాలు మొలవకున్నా, దిగుబడి రాకున్నా డీలర్‌ను అడిగే హక్కు రైతులకుంటుంది. అదీగాక సదరు కంపెనీ నుంచి పరిహారం పొందే అవకాశం కూడా ఉంటుంది.

Updated Date - 2022-06-07T05:30:00+05:30 IST