వేములవాడ సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం
ABN , First Publish Date - 2022-05-24T05:56:21+05:30 IST
భవిష్యత్త్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకోని వేములవాడ సమగ్రాభివృద్ధికి అనుగుణంగా వేములవాడ టెంపుల్ ఏరియా డెవపల్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేశామని వీటీడీఏ వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి తెలిపారు.
- వీటీడీఏ వైస్చైర్మన్ పురుషోత్తం రెడ్డి
సిరిసిల్ల, మే 23 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్త్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకోని వేములవాడ సమగ్రాభివృద్ధికి అనుగుణంగా వేములవాడ టెంపుల్ ఏరియా డెవపల్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేశామని వీటీడీఏ వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వేములవాడ మాస్టర్ ఫ్లాన్ ముసాయిదాపైనా అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ వేములవాడ పట్టణంతో పాటు ఆరు విలీన గ్రామాలు, ఏడు ఆర్ఆండ్ఆర్ గ్రామాలను కలుపుకోని మాస్టర్ప్లాన్ను సిద్ధం చేశామన్నారు. మాస్టర్ ప్లాన్ అనేది వీటీడీఏ అభివృద్ధికి కీలకమైందని శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలు కోడీకరించి వచ్చే 40 ఏళ్ల ప్రజావసారాలు, అభివృద్ధిని భవిష్యత్తుతరాలకు ఉపయోగపడేలా పట్టణ సమగ్రాభివృద్ధి సాధించేలా మాస్టర్ ప్లాన్లో అన్ని అంశాలను పొందుపర్చామన్నారు. మాస్టర్ప్లాన్పై అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేందుకు వివిధ వర్గాలు, భాగస్వాములతో విస్తృతంగా చర్చించేందుకు సమావేశం నిర్వహించామన్నారు. వచ్చే సూచనలు, సలహాలు అభ్యంతరాలపై మరోసారి చర్చించి సమగ్ర మాస్టర్ప్లాన్ రూపొందిస్తామని అన్నారు. అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మాస్టర్ప్లాన్ను సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే లిఖిత పూర్వకంగా ఇవ్వాలని అన్నారు. ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ తమకు మాస్టర్ ప్లాన్ను పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరించాలని కోరారు. వేములవాడకు చారిత్రక ప్రత్యేకతను పర్యావరణ, పురావస్తు అంశాలకు ప్రాథాన్యం ఇవ్వాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. టౌన్ప్లానింగ్ శాఖ ముఖ్య ప్రణాళిక అధికారి చంద్రిక పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గ్రోత్ కారిడార్, ఇండస్ర్టీయల్ జోన్ల ఏర్పాటును వివరించారు. సమావేశంలో వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీ బూర వజ్రవ్వ, టౌన్ప్లానింగ్ డీడీ జగన్మోహాన్, జడ్పీటీసీ మ్యాకల రవి, తదితరులు పాల్గొన్నారు.