బీపీసీఎల్‌ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2020-02-17T07:20:34+05:30 IST

ప్రభుత్వ రంగంలోని బీపీసీఎల్‌ ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పత్రాలకు ఆర్థిక, పెట్రోలియం, న్యాయ, కంపెనీ వ్యవహారాలు, ..

బీపీసీఎల్‌ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం

ఈ నెలాఖరులో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బీపీసీఎల్‌ ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పత్రాలకు ఆర్థిక, పెట్రోలియం, న్యాయ, కంపెనీ వ్యవహారాలు, పెట్టుబడుల ఉపసంహరణ శాఖల మంత్రుల కమిటీ (ఐఎంజీ) ఆమోదం తెలిపింది. కొద్ది మంది మంత్రులతో కూడిన మరో మంత్రుల కమిటీ ఈ పత్రాలను ఆమోదించాల్సి ఉంది. త్వరలోనే ఈ  పని పూర్తవుతుందని అంచనా. ఇవన్నీ పూర్తయితే ఈ నెలాఖరులోగా ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్లు, ప్రాథమిక సమాచార అవగాహన (పీఐఎం) పత్రాలు జారీ చేస్తామని అధికార వర్గాలు చెప్పాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) పీఎ్‌సయూల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ తప్పనిసరి. బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి 53.29 శాతం వాటా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.03 లక్షల కోట్లు. ఈ లెక్కన 53.29 శాతం వాటా అమ్మ కంతో ప్రభుత్వానికి రూ.54,000 కోట్ల వరకు సమకూరతాయి. ప్రభుత్వ వాటా కొనుగోలు చేసే కంపెనీ  ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా  మరో 26 శాతం షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


ఇవీ ప్రత్యేకతలు  

ప్రస్తుతం మన దేశ వార్షిక చమురు శుద్ధి సామర్ధ్యం 24.94 కోట్ల టన్నులు. అందులో బీపీసీఎల్‌ వాటా 15 శాతం. పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్‌ మార్కెట్‌లోనూ కంపెనీకి 21 శాతం వాటా ఉంది. దేశంలోని 250 విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) డిపోల్లోనూ అయిదో వంతు బీపీసీఎల్‌వే. దీంతో సౌది ఆరామ్‌కోతో పాటు అనేక బహుళ జాతి ఆయిల్‌ కంపెనీలూ బీపీసీఎల్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 

Updated Date - 2020-02-17T07:20:34+05:30 IST