రెండో విడత చందనం అరగదీతకు సన్నాహాలు
ABN , First Publish Date - 2021-05-18T05:06:58+05:30 IST
సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో రెండో విడత చందనం అరగదీతకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సింహాచలం, మే 17: సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో రెండో విడత చందనం అరగదీతకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధనలు ముగిశాక దేవాలయ బాంఢాగారంలో భద్రపరిచిన మంచి గంధం చెక్కలను ఏఈవో కేకే రాఘవకుమార్ పర్యవేక్షణలో బయటకు తీశారు. వీటిని అవసరానికి తగ్గట్టుగా 32 కిలోలు మాత్రమే ఉండేలా.. అరగదీసేందుకు అనువుగా ఉండేలా కార్పెంటర్ రమణ సిబ్బంది యంత్రంతో ముక్కలుగా కోశారు. గంధపు చెక్కలను ఆలయ పురోహితుడు కరి సీతారామాచార్యులు ఆధ్వర్యంలో వైదిక సిబ్బంది పోటులోని అనంతధార నుంచి జాలువారే పవిత్ర జలాలలో నానబెట్టారు. ఈనెల 19 నుంచి రెండో విడత చందనం అరగదీతను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి దాసరి బంగారినాయుడు, స్థానాచార్యుడు డాక్టర్ టీపీ రాజగోపాల్, తదితరులు పాల్గొన్నారు.