రబీకి ‘మద్దతు’
ABN , First Publish Date - 2020-04-08T12:10:55+05:30 IST
రబీ పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను
3.64 లక్షల మెట్నిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు సన్నాహాలు
క్వింటాకు రూ.1760
ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి వెల్లడి
పార్వతీపురం, ఏప్రిల్ 7: రబీ పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. పార్వతీపురంలోని మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన 3.64 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎవరైనా కొనుగోలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్డౌన్ వల్ల రైతులకు నష్టం జరగకూడదని భావించి ప్రభుత్వం రబీలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలను ప్రకటించడంతో పాటు కొనుగోలు చేయడానికి చర్యలు చేపట్టిందని వివరించారు. క్వింటా మొక్కజొన్నకు ఽరూ. 1760 మద్దతు ధరగా నిర్ణయించిందని చెప్పారు. వ్యాపారులు ఎవరైనా తక్కువ ధరకు కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులు తమ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో ఉండే అగ్రికల్చర్, హార్టీకల్చర్ అసిస్టెంట్ల వద్ద తాము పండిస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకుంటే ప్రభుత్వం వాటికి మద్దతు ధరలను ఇచ్చి కొనుగోలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు, వైసీపీ నాయకులు కొండపల్లి బాలకృష్ణ, మంత్రి రవికుమార్, మజ్జి నాగమణి, బెలగాం జయప్రకాష్నారాయణ తదితరులు పాల్గొన్నారు.