పూడిమడకలో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు
ABN , First Publish Date - 2021-05-11T05:13:41+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నందున అచ్యుతాపురంలో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు అనకాపల్లి ఎంపీ సత్యవతి సుముఖత వ్యక్తం చేశారని బీజేపీ నాయకులు తెలిపారు.
అచ్యుతాపురం, మే 10 : కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నందున అచ్యుతాపురంలో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు అనకాపల్లి ఎంపీ సత్యవతి సుముఖత వ్యక్తం చేశారని బీజేపీ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం పూడిమడకలో గల తుఫాన్ రక్షిత భవాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అగ్గాల హనుమంతరావు, రాష్ట్ర కిసాన్ మోర్చ ఉపాధ్యక్షుడు గొంతిన భక్తసాయిరామ్, బీజేపీ మండల అధ్యక్షుడు రాజాన రాజు మాట్లాడుతూ మండల ప్రజలతో పాటు సెజ్లో ఏర్పాటుచేసిన సుమారు 50 కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు, కూలీలు, ఉద్యోగులకు అందుబాటులో ఉండే విధంగా కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంపీకి కోరడంతో ఈ మేరకు ఆమె స్పందించారన్నారు. అంతేకాకుండా సుమారు 200 పడకలకు సరిపడా భవనాన్ని పరిశీలించమని సూచించడంతో తాము ఈ పనిలో నిమగ్నమైనట్టు చెప్పారు.