రైతుబంధు పంపిణీకి సన్నాహాలు

ABN , First Publish Date - 2021-12-24T06:25:22+05:30 IST

రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతుబంధు పథకాన్ని ఎనిమిదో విడతా ప్రస్తుత యాసంగి సీజన్‌లో అమలుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

రైతుబంధు పంపిణీకి సన్నాహాలు

 యాసంగిలో 4.93లక్షల మంది రైతులకు లబ్ధి 

ఈసారి రూ.616.21కోట్లు

నల్లగొండ, డిసెంబరు 23: రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతుబంధు పథకాన్ని ఎనిమిదో విడతా ప్రస్తుత యాసంగి సీజన్‌లో అమలుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. యాసంగిలో జిల్లాలోని 4,93,146 మంది రైతులకు రూ.616,21,46,323 పెట్టుబడి సాయంగా పంపిణీ చేయనుంది. అందుకు సంబంధించి ఇప్పటికే రైతుల వివరాలను, ఖాతా నెంబర్లను వ్యవసాయశాఖ అధికారులు ట్రెజరీలకు పంపించారు. యాసంగిలో ఏ పంటలు సాగుచేయాలనే దానిపై రైతులు సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని విడుదల చేసేందుకు నిర్ణయించింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5వేలు చొప్పున రెండు సీజన్లకు రూ.10వేలు రైతు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్యకు అనుగుణంగా పెట్టుబడి సాయం కూడా పెరగనుంది. గత వానాకాలం సీజన్‌లో మూడెకరాలలోపు భూమి ఉన్న రైతులకు మూడు రోజుల్లో పెట్టుబడి సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతిలో నగదు జమచేయనున్నారు.


రైతుబంధు సాయం ఇలా..

ప్రభుత్వం 2018 నుంచి పెట్టుబడి సాయంగా రైతులకు నగదు అందజేస్తోంది. 2018-19 ఖరీ్‌ఫలో 3,70,663 మంది రైతులకు రూ.418.70కోట్లు పంపిణీ చేశారు. అదే ఏడాది యాసంగిలో 3,64,819 మంది రైతులకు రూ.425.50కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2019-20 ఖరీ్‌ఫలో 3,77,786 మంది రైతులకు రూ.479.53కోట్లు పంపిణీ చేయగా, యాసంగిలో 3,11,394 రైతులకు రూ.344.88కోట్లు ఇచ్చారు. 2020-21 ఖరీ్‌ఫలో 4,32,335 మంది రైతులకు రూ.592.90కోట్లు, యాసంగిలో 4,40,787 మంది రైతులకు రూ.594.20కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వానాకాలంలో 4,23,892 మంది రైతులకు రూ.475,50కోట్లు జమ చేశారు. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి 4,93,146 మంది రైతులకు రూ.616,21,46,323 రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రభుత్వం నగదును విడుదలచేయగానే, రైతుల ఖాతాల్లో విడతలవారీగా జమకానున్నాయి.  

Updated Date - 2021-12-24T06:25:22+05:30 IST