ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లు
ABN , First Publish Date - 2021-10-20T06:37:00+05:30 IST
విద్యుత్ పంపిణీ సంస్థలు బకాయిలను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈపీడీసీఎల్ కసరత్తు
బకాయిలు తగ్గించుకోవడమే లక్ష్యం
వచ్చే ఏడాది మార్చిలోగా లక్ష మీటర్ల ఏర్పాటు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విద్యుత్ పంపిణీ సంస్థలు బకాయిలను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన కార్యాలయాలన్నింటికీ త్వరలో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. దేశంలో పంపిణీ సంస్థలకు అత్యధిక బకాయిలు ప్రభుత్వ సంస్థలు నుంచే ఉంటున్నాయి. ఏపీఈపీడీసీఎల్ను తీసుకుంటే...విశాఖపట్నం జిల్లాలో నెలకు రూ.410 కోట్లు బిల్లింగ్ జరుగుతుంటే...అందులో సుమారు రూ.50 కోట్ల వరకు బకాయిలు ఉంటున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, కార్పొరేషన్లు, మునిసిపాలిటీలే బకాయి పెడుతున్నాయి. ప్రస్తుతం ఈపీడీసీఎల్కు రూ.153 కోట్లు రావలసి ఉంది. ఇలాంటి బకాయిలను తగ్గించి, పంపిణీ సంస్థలు సక్రమంగా పనిచేసేందుకు ప్రీపెయిడ్ మీటర్లు ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే తొలుత వ్యవసాయ కనెక్షన్లకు ప్రీపెయిడ్ మీటర్ల విధానం అమలులోకి తీసుకువచ్చారు. ఆ తరువాత దశలో స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెడతారు. వీటిని ముందుగానే రీచార్జ్ చేసుకోవాలి. దాంతో ఇక బకాయిల ఊసే ఉండదు. ఈపీడీసీఎల్ ఇందుకోసం లక్ష మీటర్లను సమకూర్చుకుంటోంది. ఇప్పటికే టెండర్లు పిలిచింది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు వీటిని బిగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అనవసర వినియోగమే ఎక్కువ
ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లో విద్యుత్ను అవసరానికి మించి వినియోగిస్తున్నారు. ఎక్కడా ఆంక్షలు లేవు. కార్యాలయాల్లో చిన్న చిన్న అధికారులు సైతం తమ గదులకు ఏసీలను పెట్టుకుంటున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులకే ఏసీ సదుపాయం అనుమతిస్తారు. కానీ కలెక్టరేట్లో చాలామందికి ఏసీలు ఉన్నాయి. అలాగే జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, రెవెన్యూ కార్యాలయాలు, దేవదాయ శాఖ, రిజిసే్ట్రషన్ల శాఖ, ఎక్సైజ్, పోలీస్, ఇలా అన్ని శాఖల్లోను ఏసీలను విరివిగా వినియోగిస్తున్నారు. దాంతో బిల్లుల భారం పెరిగిపోతోంది. ప్రీపెయిడ్ మీటర్లు వస్తే...ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని, నిబంధనల మేరకు వినియోగం జరిగేలా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. లేదంటే....పరిపాలనా వ్యవహారాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.