ప్రేమికులని ముద్ర.. ఇద్దరి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-08-11T06:48:46+05:30 IST

సమాజంలోని కొందరు అన్నాచెల్లెళ్ల సంబంధానికి ప్రేమికులుగా ముద్ర వేస్తున్నారంటూ ఇద్దరు ఆత్మహత్యకు యత్నించిన ఘటన బుధవారం జిల్లాలో కలకలం రేపింది.

ప్రేమికులని ముద్ర.. ఇద్దరి ఆత్మహత్యాయత్నం

యువకుడి మృతి.. ప్రాణాపాయ స్థితిలో బాలిక

సుభాష్‌నగర్‌, ఆగస్టు 10: సమాజంలోని కొందరు అన్నాచెల్లెళ్ల సంబంధానికి ప్రేమికులుగా ముద్ర వేస్తున్నారంటూ ఇద్దరు ఆత్మహత్యకు యత్నించిన ఘటన బుధవారం జిల్లాలో కలకలం రేపింది. ఇందులో యువకుడు ఒకరు మృతి చెందగా, బాలిక మృత్యువుతో పోరాడు తోంది. వివరాల్లోకి వెళితే.. నందిపేట మండలం దత్తాపూర్‌ గ్రామానికి చెందిన యువకుడు వినయ్‌ కుమార్‌ (22), తొండకూర్‌ గ్రామానికి చెందిన వేదిక చిన్ననాటి స్నేహితులు. ఒకే స్కూల్‌లో చదవడం వల్ల వీరి మధ్య స్నేహం ఏర్పడింది. వినయ్‌కుమార్‌ ప్రస్తుతం నిజామాబాద్‌ నగరంలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో డీఎంఎల్‌టీలో శిక్షణ తీసు కుంటుండగా.. వేదిక పాలిటెక్నిక్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. అయితే వీరిద్దరూ చిన్ననాటి నుంచే అన్నాచెల్లెలిగా కలిసి మెలిసి ఉన్నారు. అయితే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వీరి మధ్య ప్రేమ ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్టు పుకార్లు లేపారు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వినయ్‌ కుమార్‌, వేదికలు సోమవారం అర్ధరాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అయితే ఆత్మ హత్యకు పాల్పడే ముందు ఇద్దరూ తమ తమ కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వెంటనే నిజామాబాద్‌లోని ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అపస్మారక స్థితిలో పడి ఉన్న ఇద్దరినీ ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. బుధవారం వినయ్‌కుమార్‌ పరిస్థితి విషమించడంతో మృతి చెందగా.. వేదిక ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు పోలీసులు వినయ్‌కుమార్‌ వద్ద సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. తమ మధ్య అన్నాచెల్లెళ్ల బంధం మాత్రమే ఉందని.. కానీ సమాజంలోని కొందరు దీన్ని ప్రేమ అంటూ రకకాలు గా ప్రచారం చేయడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని సూసైడ్‌ నోట్‌లో స్పష్టం చేశారు. వినయ్‌కుమార్‌ తండ్రి గంగాధర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-08-11T06:48:46+05:30 IST